టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అతని చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ తెలిపారు. రోహిత్ శర్మతో పాటు తన శిష్యుడైన మరో టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని స్పష్టం చేశారు.
తన ఫౌండేషన్కు కూడా ఎలాంటి సహకారం అందించలేదని చెప్పిన దినేష్ లాడ్.. తాను కూడా వారిని ఇప్పటి వరకు ఏది అడగలేదని పేర్కొన్నారు.
ముంబైకి చెందిన దినేష్ లాడ్ పర్యవేక్షణలోనే రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ స్టార్ క్రికెటర్లుగా ఎదిగారు. 1999లో ఒక సమ్మర్ క్యాంప్లో రోహిత్ శర్మ ప్రతిభను గుర్తించిన దినేష్ లాడ్.. ప్రత్యేకంగా ప్రోత్సహించారు. అప్పట్లో రోహిత్ కేవలం ఆఫ్ స్పిన్ బౌలింగ్ మాత్రమే చేసేవాడు. కానీ అతనిలో మంచి బ్యాటింగ్ ప్రతిభ ఉందని గ్రహించిన దినేష్ లాడ్.. ఆ దిశగా ప్రోత్సహించి గొప్ప బ్యాటర్గా తీర్చి దిద్దారు.

రోహిత్ శర్మ ఆర్థిక పరిస్థితి అప్పట్లో అంతంత మాత్రంగానే ఉండటంతో తాను కోచ్గా ఉన్న 'స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్'లో స్కాలర్షిప్తో కూడిన ఫ్రీ సీట్ ఇప్పించారు. ఇది రోహిత్ జీవితాన్నే మార్చేసింది. దినేష్ లాడ్ ప్రస్తుతం తన క్రికెట్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది నిరుపేద, ప్రతిభావంతులైన క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు.
తాజాగా మా మాఖేల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహకారం అందించలేదని, భవిష్యత్తులో తన శిష్యులు కచ్చితంగా సహాయం చేస్తారని దినేష్ లాడ్ చెప్పుకొచ్చారు. 'రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ క్రికెట్ నుంచి దృష్టి మళ్లించకూడదనే ఉద్దేశంతో నేను వారిని ఏమీ అడగలేదు. కానీ, వారి క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కచ్చితంగా సహాయం చేస్తారనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు.
ముంబై రంజీ ప్లేయర్గా ఉన్న నా కుమారుడు సిద్ధేష్ లాడ్ సహాయం చేస్తున్నాడు. అమెరికా క్రికెటర్ హర్మీత్ సింగ్ నా ఫౌండేషన్కు రూ. 10 లక్షల రూపాయల విరాళం అందించారు.'అని దినేష్ లాడ్ పేర్కొన్నారు. ముంబైకి చెందిన హర్మిత్ సింగ్.. భారత దేశవాళీ క్రికెట్ కూడా ఆడాడు. ఇక్కడ అవకాశాలు రావడంతో అమెరికాకు వలస వెళ్లి ఆ దేశం తరఫున ఆడుతున్నాడు.
ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ హర్మీత్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. దినేష్ లాడ్ వ్యాఖ్యల పట్ల అభిమానులు ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన రోహిత్ శర్మ.. తన కోచ్కు ఆర్థిక సహాయం చేయకపోవడం నమ్మశక్యంగా లేదని కామెంట్ చేస్తున్నారు.