
ద్రవిడే వద్దన్నాడు..
కానీ మిస్టర్ డిపెండబులే తమ ఆఫర్ను తిరస్కరించాడని స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ రాయ్ తెలిపాడు. ‘రాహుల్ ద్రవిడే మాకు సరైనవాడనిపించింది. కానీ అతను మాత్రం ఈ పదవిని చెప్పట్టేందుకు సుముఖంగా లేనని చెప్పాడు. ‘నాకు ఎదుగుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్నాళ్లు భారత జట్టు తరఫున ఆడి దేశాలు పట్టుకొని తిరిగా. దీని వల్ల వారికి సమయం కేటాయించలేకపోయా. కనీసం ఇప్పుడైనా ఇంటిపట్టునే ఉంటూ వారికి సమయం కేటాయించాలనుకుంటున్నా'అని ద్రవిడ్ మాతో అన్నాడు. అతని అభ్యర్థన కూడా సరైందే అనిపించింది. దీంతో మేం కూడా అతన్ని బలవంతం చేయలేదు'అని రాయ్ వెల్లడించాడు.

రవిశాస్త్రికే అవకాశం..
ఇక వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీల నుంచి పోటీ ఎదురైనా టీమ్ డైరెక్టర్గా పనిచేసిన రవిశాస్త్రికే ఈ బాధ్యతలు దక్కాయి. అయితే తొలుత అంత ఆసక్తి కనబర్చిన శాస్త్రి... బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించడంతో అనూహ్యంగా రేసులోకి వచ్చాడు. ఇక గతేడాది తన హెడ్ కోచ్ పదవికాలాన్ని 2021 టీ20 ప్రపంచకప్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

ఎన్సీఏ డైరెక్టర్గా
ఇక అప్పట్లో టీమిండియా కనసల్టెంట్స్కు రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ పేర్లు కూడా వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం వారికి ఎలాంటి కాంట్రాక్టు ఇవ్వలేదు. ఇక ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అయిన జహీర్ ఖాన్ కామెంట్రీ చెబుతుండగా.. ద్రవిడ్ భారత్-ఏ, అండర్-19 టీమ్లకు కోచ్గా కొనసాగాడు. 2019లో ఈ బాధ్యతలను కూడా వదులుకున్న అతను.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరక్టర్గా కొనసాగుతున్నాడు.

ప్రతిభగల యువ ఆటగాళ్లు..
ఇక భారత్-ఏ, అండర్-19 కోచ్గా ద్రవిడ్ ఎందరో ప్రతిభావంతమైన ఆటగాళ్లను భారత జట్టుకు అందించాడు. ప్రస్తుత భారత జట్టులో ఆడుతున్న పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్లు ద్రవిడ్ దిశానిర్దేశంలోనే మెరుగైన ఆటగాళ్లు. పృథ్వీషా నేతృత్వంలోని భారత అండర్-19 జట్టు ప్రపంచకప్ గెలిచిందన్నా.. ఈ ఏడాది ప్రియామ్ గార్గ్ సేన ఫైనల్కు చేరిందన్నా అది ద్రవిడ్ కోచింగ్ సామర్థ్యమే. ఇప్పుడు ఎన్సీఏ అకాడమీ డైరక్టర్గా సీనియర్ క్రికెటర్లకు కూడా దిశానిర్దేశం చేస్తున్నాడు.
ఇక ద్రవిడ్ తన అంతర్జాతీయ కెరీర్లో భారత్ తరఫున 164 టెస్టుల్లో 13,288.. 344 వన్డేల్లో 10,899.. ఒక టీ20లో 31 పరుగులు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు.


Click it and Unblock the Notifications












