ఐపీఎల్ 2025 ఉచిత పాస్ల విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) మధ్య నెలకొన్న వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హెచ్సీఏపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని విజిలెన్స్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐపీఎల్ 2025 ఉచిత పాస్ల కోసం హెచ్సీఏ తమను వేధిస్తోందని ఆరోపిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ ఆరోపించిన విషయం తెలిసిందే.
గత రెండేళ్లుగా హెచ్సీఏ నుంచి తమకు వేధింపులు ఎక్కువయ్యాయని, ఉచిత పాసుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజర్.. హెచ్సీఏ సెక్రటరీకి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. 'మేం గత 12 ఏళ్లుగా హెచ్సీఏతో కలిసి పని చేస్తున్నాం. కానీ గత రెండేళ్లుగా హెచ్సీఏ నుంచి ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటున్నాం. ఎన్నో ఏళ్లుగా మాకు ఉన్న ఒప్పందం ప్రకారమే హెచ్సీఏకు 3900 కాంప్లిమెంటరీ టికెట్లు, అందులోనే 50 (ఎఫ్12ఏ) కార్పొరేట్ బాక్స్ టికెట్లు కేటాయిస్తున్నాం. కానీ ఈ ఏడాది ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే.

దాంతో అదనంగా మరో బాక్స్లో 20 టికెట్లు కేటాయించాలని హెచ్సీఏ డిమాండ్ చేస్తోంది. దీనిపై చర్చించి, సరైన నిర్ణయం తీసుకుందామని చెప్పాం. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలోకే వస్తుంది. దానికి అద్దె కూడా చెల్లిస్తున్నాం. కానీ గత మ్యాచులో ఎఫ్-3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా మరో 20 ఫ్రీ టికెట్లు కావాలని, లేదంటే బాక్స్ తెరవమంటూ చివరి నిమిషంలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది సరైన చర్య కాదు. ఇలా చేస్తే సమన్వయంతో పని చేయడం ఇబ్బందిగా మారుతుంది.
అయినా వాళ్లు ఇలా బెదిరింపులకు పాల్పడం ఇదేం తొలిసారి కాదు. గత రెండే సీజన్లలో హెచ్సీఏ, మా సిబ్బందిని ఎన్నో సార్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మేం దీన్ని హెచ్సీఏ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఈ ఏడాది హెచ్సీఏ అధ్యక్షుడు కూడా పలుసార్లు బెదిరించారు. వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఈ స్టేడియంలో సన్రైజర్స్ ఆడడం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో సంప్రదించి ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. మరో వేదికను చూసుకుంటాం. ఈ సమస్యను పరిష్కారించాలని కోరుకుంటున్నాం." అని సన్రైజర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ లేఖలో రాసుకొచ్చారు.
ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో హెచ్సీఏ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. మరోవైపు హెచ్సీఏ ఈ లేఖ అవాస్తవమని ప్రకటించింది. హెచ్సీఏ నుంచి తమకు ఎలాంటి లేఖ రాలేదని స్పష్టం చేసింది. కానీ తాజా సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో ఈ గొడవ నిజమేనని అర్థమవుతోంది.