భారత మహిళా క్రికెటర్, హైదరాబాద్ పేస్ ఆల్రౌండర్ అరుంధతి రెడ్డికి రేవంత్ సర్కార్ మొండి చెయ్యి చూపించింది. క్రీడాకారులను గౌరవించుకోవడం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని గొప్పలు చెప్పుకునే రేవంత్ సర్కార్.. మహిళా ప్రపంచకప్ విజేత అయిన అరుంధతి రెడ్డిని మాత్రం పట్టించుకోలేదు. విశ్వవిజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలిగా ఉన్న అరుంధతి రెడ్డి.. గురువారం రాత్రి హైదరాబాద్ నగరానికి చేరుకుంది.
ప్రభుత్వం నుంచి ఆమెకు తెలంగాణ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి ఒక్కరే స్వాగతం పలకగా.. మంత్రులు ఎవరూ వెళ్లలేదు. అవినీతి, కేసుల్లో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)ప్రతినిధులు కూడా ఎవరూ స్వాగతం పలకలేదు. ప్రభుత్వం నుంచి ఆమెకు ఎలాంటి సన్మాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయలేదు. శుక్రవారం మాత్రం తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన కార్యాలయంలో అరుంధతి రెడ్డిని సన్మానించారు. ఎలాంటి క్యాష్ ప్రైజ్, బహుమతులు ప్రకటించలేదు.

జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. అరుంధతి రెడ్డి విజయాన్ని పట్టించుకోలేదు. ఇతర మంత్రులు కూడా ఆమె విజయాన్ని గుర్తించలేదు. సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన అధికారులకు కూడా ఎలాంటి సోయి లేకుండా పోయింది. గతంలో భారత పురుషుల టీ20 ప్రపంచకప్ 2025లో సభ్యుడిగా ఉన్న మహమ్మద్ సిరాజ్ను ఘనంగా సన్మానించిన రేవంత్ సర్కార్.. డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ. 600 గజాల ఇంటి స్థలం ఇచ్చింది.
ఆసియా కప్ 2025 గెలిచిన తర్వాత నగరానికి వచ్చిన తిలక్ వర్మకు కాంగ్రెస్ సర్కార్ ఘనంగా స్వాతం పలికింది. బహుమతులు ప్రకటించకపోయినా.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తిలక్ వర్మను ఘనంగా సన్మానించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ ముందుంటుందని, ఇంటర్ చదివిన సిరాజ్కు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి.. తమ సామాజిక వర్గానికే చెందిన అరుంధతి రెడ్డిని పట్టించుకోకపోవడం క్రీడా అభిమానులను ఆశ్చర్యపరించింది.
పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం వరల్డ్ కప్ ఛాంపియన్ శ్రీ చరణికి స్వాగతం పలికేందుకు మంత్రులు అంతా విమానాశ్రయానికి వచ్చారు. శ్రీ చరణితో పాటు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ను కూడా విజయవాడకు రప్పించారు. భారీ ర్యాలీతో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దగ్గరకు తీసుకొచ్చారు. శ్రీ చరణి విజయానికి ఫిదా అయిన చంద్ర బాబు రూ. 2.5 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్తో పాటు కడపలో 1000 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
అరుంధతి రెడ్డికి మాత్రం రేవంత్ సర్కార్ మొండి చెయ్యి చూపించింది. బహుమతి దేవుడెరుగు.. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డితో కనీసం సన్మానం కూడా చేయించలేదు. హైదరాబాద్కే చెందిన మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్ను కూడా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్పై క్రీడా అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్లో అరుంధతి రెడ్డి ఒక్క మ్యాచ్ ఆడకపోయినా ఆమె జట్టులో భాగంగా ఉంది. ఎక్స్ట్రా ప్లేయర్గా జట్టుకు సేవలందించింది. పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో కూడా సిరాజ్ భాగంగానే ఉన్నాడు. అతనికి కూడా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. ఈ క్రమంలోనే సిరాజ్ తరహాలోనే అరుంధతి రెడ్డికి కూడా ప్రోత్సాహకం అందించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.