కేప్టౌన్: సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే చివరిదైన మూడో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 97 పరుగుల తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (37 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్స్లు), ఫించ్ (37 బంతుల్లో 55; 6 ఫోర్లు, సిక్స్)... తొలి వికెట్కు 67 బంతుల్లోనే 120 పరుగులతో శుభారంభం చేశారు. చివర్లో స్మిత్ (15 బంతుల్లో 30 నాటౌట్; 2 సిక్స్లు) ధనాధన్ బ్యాటింగ్తో మెరుపులు మెరిపించడంతో ఆసీస్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
అనంతరం ఛేజింగ్కు దిగిన సౌతాఫ్రికా 15.3 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్, ఆస్టన్ అగర్ చెరో మూడు వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. డస్సెన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు) టాప్ స్కోరుగా నిలిచాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా స్టార్క్... 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా ఫించ్ అవార్డులు అందుకున్నారు. పరుగుల పరంగా సఫారీలకు టీ20ల్లో ఇది రెండో అతి పెద్ద పరాభవం కాగా. ఇదే సిరీస్ తొలి మ్యాచ్లో 107 పరుగులతో ఓడటం తొలి ఘోర పరాజయం. గత ఏడాది కాలంలో సౌతాఫ్రికా స్వదేశంలో వరుసగా ఓడిపోయిన నాలుగో సిరీస్ ఇది. చివరి సారిగా గత ఏడాది మార్చిలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను 2-1తో గెల్చుకుంది.