సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ క్రిస్ మోరిస్ తన అత్యుత్తమ ఆల్టైమ్ టీ20 ఎలెవన్ను ప్రకటించాడు. ఈ జట్టులో భారత్ నుంచి ఐదుగురు ఆటగాళ్లకు అవకాశం కల్పించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పాకిస్థాన్ నుంచి ఒక్క ఆటగాడిని కూడా మోరిస్ ఎంపిక చేయలేదు. వెస్టిండీస్ నుంచి ముగ్గురి ఆటగాళ్లను తీసుకున్న మోరిస్.. శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల నుంచి ఒక్కో ఆటగాడిని ఎంపిక చేశాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను తన ఆల్టైమ్ టీ20 ఎలెవన్కు ఓపెనర్గా ఎంపిక చేసిన క్రిస్ మోరిస్.. తాను ఎదుర్కొన్న బ్యాటర్లలో హిట్ మ్యాన్ టఫెస్ట్ బ్యాటరని చెప్పుకొచ్చాడు. ఇక అతనికి తోడుగా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ను ఎంపిక చేశాడు.

మూడో స్థానంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తీసుకున్న మోరిస్.. నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ను ఎంపిక చేశాడు. అనుభవం కలిగిన ఆటగాళ్లకు ఎక్కువ బంతులు ఆడే అవకాశం దక్కాలనే ఈ ఇద్దరిని మూడు, నాలుగు స్థానాల్లో ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ కీరెన్ పోలార్డ్ను ఐదో స్థానంలో తీసుకున్న మోరిస్.. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపర్గా ఆరోస్థానంలో ఎంపిక చేశాడు. అతన్నే తన అత్యుత్తమ జట్టుకు సారథిగా ప్రకటించాడు. ఏడో స్థానంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంచుకున్న మోరిస్.. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో లసిల్ మలింగా, బ్రెట్ లీలతో కూడి పేస్ విభాగాన్ని ఎంచుకున్నాడు. సునీల్ నరైన్ను ఏకైక స్పిన్నర్గా ఎంపిక చేశాడు.
ఈ అత్యుత్తమ జట్టులో ఈ తరం ఆటగాళ్లలో కీలకమైన సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్లు, పాకిస్థాన్ ఆటగాళ్లు లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
క్రిస్ మోరిస్ ఆల్టైమ్ టీ20 ఎలెవన్: రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, కీరన్ పోలార్డ్, మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యా, సునీల్ నరైన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా, బ్రెట్ లీ