శుభారంభం లేదు..
148 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ మనన్ వోహ్రా(9) క్రిస్ వోక్స్ వేసిన మూడో ఓవర్లో వరుస బౌండరీల బాదాడు. అదే జోరులో హ్యాట్రిక్ ఫోర్కు ప్రయత్నించిన అతను.. రబడా చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే బంతి వ్యవధిలో మరో ఓపెనర్ జోస్ బట్లర్(2) కీపర్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్.. రబడా వేసిన మరుసటి ఓవర్లో స్లిప్లో ధావన్కు చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, శివమ్ దూబే డిఫెన్స్కు పరిమితమయ్యారు. రబడా బౌలింగ్లో మిల్లర్ ఓ బౌండరీ కొట్టడంతో రాజస్థాన్ పవర్ ప్లేలో మూడు వికెట్లకు 26 రన్స్ చేసింది.
ఆదుకున్న మిల్లర్..
ఆ వెంటనే రాజస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అవేశ్ ఖాన్ బౌలింగ్లో శివమ్ దూబే(2) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్(2) కూడా తీవ్రంగా నిరాశ పర్చాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియాతో మిల్లర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్లో రెండు వరుస బౌండరీలు బాదిన మిల్లర్.. స్టోయినిస్ వేసిన 13వ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించాడు. ఇక టామ్ కరన్ బౌలింగ్లో తెవాటియా కూడా రెండు బౌండరీలు బాది జోరు కనబర్చాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీసేందుకు ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ తన ట్రంప్ కార్డ్ కగిసో రబడాను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు. అతని బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన తెవాటియా.. ఫార్వార్డ్లో లలిత్ యాదవ్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. దాంతో 6వ వికెట్కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రిస్ వోక్స్ వీరవిహారం..
క్రీజులోకి క్రిస్ మోరీస్ రాగా.. అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్ ఫస్ట్ బాల్కు సింగిల్ తీసిన మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది రాజస్థాన్ శిబిరంలో ఆశలు రెకెత్తించాడు. కానీ ఆ మరుసటి బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరగడంతో రాజస్థాన్ ఓటమి ఖాయమనిపించింది. ఇక క్రిస్ వోక్స్ బౌలింగ్లో ఉనాద్కత్ ఓ భారీ సిక్సర్ కొట్టగా.. ఆ మరుసటి ఓవర్లో టామ్ కరన్ బౌండరీ ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దాంతో రాజస్థాన్ విజయానికి 12 బంతుల్లో 27 రన్స్ అవసరం కాగా.. రబడా వేసిన 19 ఓవర్లో క్రిస్ మోరీస్ రెండు భారీ సిక్స్లు బాది ఆశలు రేకెత్తించాడు. దాంతో రాజస్థాన్ విజయానికి చివరి ఓవర్లో 12 పరుగులు అవసరమయ్యాయి. టామ్ కరన్ వేసిన ఆ ఓవర్లో రెండు భారీ సిక్స్లు కొట్టిన క్రిస్ మోరిస్ రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందించాడు.