
దుబాయ్: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టీమిండియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. తన ఫియాన్సీ ధనశ్రీతో కలిసి యష్రాజ్ ముఖాతే ర్యాప్ సాంగ్ 'రాసోడ్ మెయి కౌన్ థా'ను అనుకరించాడు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. కాబోయే సతీమణితో చేసిన ఈ వీడియోను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. పాటకు తగ్గట్లు తమ హావభావాలు పలికారని ఈ జోడీని మెచ్చుకుంటున్నారు.
ఇక ఈ వీడియోను చూసిన వెస్టిండీస్ బ్యాట్స్మన్, యూనివర్స్ బాస్ క్రిస్గేల్ మరోసారి ఆర్సీబీ స్పిన్నర్కు వార్నింగ్ ఇచ్చాడు. 'చాహల్ ఇప్పటికే చాలా చేశావు. నేనిప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ను రిపోర్ట్ చేస్తున్నా' అని ఫన్నీ ఎమోజీలతో కామెంట్ చేస్తూ హెచ్చరించాడు. అంతకుముందు లాక్డౌన్ సమయంలోనూ చాహల్ ఈ విధ్వంసక వీరుడు చేతిలో చివాట్లు తిన్నాడు. లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన చహల్ తన కోతి వేశాలతో సహచర ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేశాడు. ప్రతీ ఒక్కరి వ్యవహారాల్లో దూరిపోయి కామెంట్ చేశాడు. ఇలానే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ను కుల వివక్ష వ్యాఖ్యల్లో ఇరికించాడు.
ఆన్లైన్లో కనిపిస్తే చాలు చటుక్కున వాళ్ల మధ్య దూరిపోయి సరదా జోక్లతో కవ్వించేవాడు. ఈ క్రమంలోనే అతడి వీడియోలు చూసిన క్రిస్గేల్, రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు చాహల్ను మందలించారు. ఇక లాక్డౌన్ అనంతరం ధనశ్రీతో నిశ్చితార్ధం చేసుకున్న ఈ ఆర్సీబీ స్పిన్నర్.. ఆ ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని. అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఆపై ఐపీఎల్ ఆడేందుకు ఆర్సీబీతో కలిసి దుబాయ్కు వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ ప్రాక్టీస్ చేస్తూ మెగా ఈవెంట్ కోసం సన్నద్ధమౌతున్నాడు.