న్యూఢిల్లీ: రెండు సార్లు ఛాంపియన్, తమ ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని గడగడలాడించిన వెస్టిండీస్ టీమ్ ప్రస్తుతం వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్ టోర్నీలో పసికూన స్కాట్లాండ్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. ఈ అనూహ్య పరిణామంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్కు గురైంది.
వెస్టిండీస్ లేకుండా జరిగే ప్రపంచకప్ టోర్నీ చూడలేమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వెస్టిండీస్ ఆటగాళ్లు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భీకరమైన ఆట తీరుతో ఫలితాన్ని మార్చేసే ఆటగాళ్లు ఉన్న జట్టు ఇలా ప్రపంచకప్ అర్హత సాధించకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు.

ఐసీసీ కూడా వెస్టిండీస్ టీమ్ ఆటగాళ్ల ఆవేదనను తెలియజేస్తూ ఇన్స్టాలో ఓ రీల్ షేర్ చేసింది. ఇందులో వెస్టిండీస్ టీమ్ ఆటగాళ్లు, మాజీ ప్లేయర్లు తీవ్ర బాధను వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోపై స్పందించిన యూనివర్స్ బాస్, వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ క్రిస్ గేల్.. ఈ పోస్ట్ను తొలగించాలంటూ ఐసీసీని కోరాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్గా మారింది.
వెస్టిండీస్ పతనానికి ఆర్థిక సంక్షోభం కూడా ఓ కారణమని ఆ జట్టు దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బిషప్ అన్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు క్రికెట్లోకి రాకముందే ఈ పతనం ప్రారంభమైందన్నాడు. 'నెమ్మది నెమ్మదిగా జరిగిన పతనమిది. ప్రస్తుత జట్టు క్రికెట్ మొదలుపెట్టక ముందే వెస్టిండీస్ పతనం మొదలైంది. దాదాపు పదేళ్లుగా మా జట్టు వన్డేల్లో అగ్ర జట్లపై సరైన ప్రదర్శన చేయట్లేదు.
టీ20ల్లో మాత్రమే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్లు అయ్యాం. ఆ తర్వాత ఇంకా మెరుపులు లేవు. పతనం వేగంగా సాగింది. ప్రస్తుత విండీస్కు ఇంతకు మించి ప్రదర్శన చేసే సత్తా ఉందని నమ్ముతున్నా. కెప్టెన్, కోచ్లు మారారు. వారికి కుదురుకునే సమయం ఇవ్వాలి. తక్కువ వనరులతోనే జింబాబ్వే అదరగొడుతుంటే.. వెస్టిండీస్ ఎందుకు మెరుగుకాకూడదూ?'' అని బిషప్ ప్రశ్నించాడు.