పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీపై యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు చేశాడు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తనను దారుణంగా అవమానించిందని తెలిపాడు. సీనియర్ ఆటగాడినైన తనను ఓ పిల్లాడిలా చూసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంజాబ్ టార్చర్ తట్టుకోలేక అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే ముందు తాను బోరున ఏడ్చానని క్రిస్ గేల్ గుర్తు చేసుకున్నాడు. అప్పటి పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రిక్వెస్ట్ చేసినా.. తాను సీజన్ మధ్యలోనే స్వదేశం వెళ్లిపోయానని తెలిపాడు.
ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్లు ఆడిన క్రిస్ గేల్ తన ఐపీఎల్ కెరీర్ను 2021లో ముగించాడు. తన చివరి సీజన్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే పంజాబ్ తనకు అవకాశాలు ఇవ్వకుండా అవమానించిందని తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో క్రిస్ గేల్ ఆరోపించాడు.
'పంజాబ్ కింగ్స్తో నా ఐపీఎల్ ప్రయాణం చాలా ముందుగానే ముగిసింది. నిజాయితీగా చెప్పాలంటే ఆ జట్టులో నాకు సరైన గౌరవం లభించలేదు. ఈ లీగ్ కోసం.. పంజాబ్ ఫ్రాంచైజీ కోసం ఓ సీనియర్ ఆటగాడిగా ఎంతో చేసిన నన్ను సరిగ్గా చూసుకోలేదు. నన్ను ఓ చిన్న పిల్లాడిలా ట్రీట్ చేశారు. నా భుజాలపై ఏదో బరువును మోస్తున్నట్లు అనిపించింది. ఫ్రాంచైజీ వైఖరి కారణంగా నేను తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాను. నా జీవితంలో తొలిసారి డిప్రెషన్ లాంటి భావన కలిగింది. అందుకే ఎవరైనా డిప్రెషన్ గురించి మాట్లాడితే.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కొంచెం అర్థమవుతుంది.
పంజాబ్ కింగ్స్ టార్చర్ భరించలేకపోయాను. వీలైనంత త్వరగా జట్టును వీడాలనుకున్నాను. డబ్బు కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యం అనిపించింది. అప్పటి కోచ్ అనిల్ కుంబ్లేకు ఫోన్ చేసి నా పరిస్థితిని చెప్పాను. అదే సమయంలో టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. కరోనా కారణంగా బయో బబుల్లో ఉండటంతో బయటికి వెళ్లేందుకు కూడా ఆస్కారం లేదు. దాంతో నేను తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను. అది నన్ను మరింత గందరగోళానికి గురిచేసింది. ముంబై ఇండియన్స్తో ఆడిన నా చివరి మ్యాచ్ తర్వాత నేను ఆడటం సరికాదనిపించింది. ప్రశాంతత కరువైన చోటు ఉండి నన్ను నేను నాశనం చేసుకుంటున్నాననిపించింది.

అనిల్ కుంబ్లేకు ఫోన్ చేసి మాట్లాడాను. ఆ సమయంలో నేను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. నిజం చెప్పాలంటే బోరున ఏడ్చేసాను. అప్పుడు ఫ్రాంచైజీ నడుస్తున్న తీరు.. అనిల్ కుంబ్లే ప్రవర్తన పట్ల నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. నేను కుంబ్లేకు 'ధన్యవాదాలు మిత్రమా'అని చెప్పాను. రాహుల్ నాకు ఫోన్ చేసి.. జట్టులోనే ఉండాలని, తర్వాతి మ్యాచ్ ఆడుతావని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ నేను అంగీకరించలేదు. మీ అందరికి మంచి జరగాలని చెబుతూ.. బ్యాగ్ సర్దుకొని వెళ్లిపోయాను.'అని గేల్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనుకోలేదా? అని యాంకర్ ప్రశ్నించగా.. వారు కోరుకోలేదు.. తాను రాలేదని బదులిచ్చాడు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఆటగాళ్లను చూసుకునే విధానం తెలియదని, ఈ కారణంగా చాలా మంది ఆటగాళ్ళు ఆ జట్టులో ఆడటానికి ఇష్టపడరని కూడా గేల్ అభిప్రాయపడ్డారు.
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 రెండు దశల్లో జరిగింది. కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన లీగ్.. యూఏఈ వేదికగా పూర్తి చేశారు. సెకండ్ ఫేజ్ మధ్యలోనే గేల్ జట్టును వదిలేసి వెళ్లిపోయాడు. సెకండాఫ్లో మూడు మ్యాచ్లకు రెండు మాత్రమే ఆడిన గేల్..మొత్తం 10 మ్యాచ్లు ఆడి 21.44 సగటుతో 193 పరుగులు చేశాడు. ఓవరాల్గా 142 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన గేల్ 39.72 సగటు, 148.92 స్ట్రైక్రేట్తో 4965 పరుగులు చేశాడు. 2018లో పంజాబ్ కింగ్స్ జట్టులో చేరిన గేల్.. 2021లో ఆ జట్టును వదిలేసాడు.