టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన టీమిండియాకు క్యాష్ రివార్డ్ ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వంపై భారత బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెటర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. తనలాంటి క్రీడాకారులను మాత్రం ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించాడు.
క్రీడాకారుల పట్ల ఇలాంటి వివక్ష తగదని, అందరినీ సమానంగా చూడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కోరాడు. వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించిన టీమిండియా.. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్ అందుకుంది.

దాంతో బీసీసీఐ ముంబైలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే మైదానంలో ప్రపంచకప్ సంబరాలు నిర్వహించిన బీసీసీఐ.. రూ. 125 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ను అందజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం టీమిండియాకు రూ. 11 కోట్ల క్యాష్ రివార్డ్ ప్రకటించింది. టీమిండియాలో భాగమైన మహారాష్ట్ర ఆటగాళ్లను ఘనంగా సన్మానించింది.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తన నివాసంలో సన్మానించారు. అదే రాష్ట్రానికి చెందిన చిరాగ్ శెట్టి.. తాను సాధించిన విజయాలను గుర్తించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.
'బ్యాడ్మింటన్లో కీలక థామస్ కప్ గెలిచిన భారత జట్టులో నేను సభ్యుడిని. ఇది టీ20 ప్రపంచకప్ కంటే తక్కువేం కాదు. మహారాష్ట్ర నుంచి ఈ ఘనతను అందుకున్న ఏకైక ఆటగాడిని నేనే. ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లను సన్మానించడం సంతోషించదగిన విషయమే. కానీ నాలాంటి ఆటగాళ్ల శ్రమను కూడా గుర్తిస్తే బాగుంటుంది. క్రీడలన్నింటినీ ప్రభుత్వం ఒకేలా చూడాలి.
క్రికెటర్లను సత్కరించడం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బ్యాడ్మింటన్ ప్లేయర్లు కూడా టీ20 ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదించారు. అయితే మా విజయాలను కూడా ప్రభుత్వం గుర్తించాలనేదే మా ఆవేదన. గత రెండేళ్లలో నేను కూడా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం నన్ను అభినందించలేదు. ఎలాంటి క్యాష్ రివార్డ్ ప్రకటించలేదు. 2022 కంటే ముందు భారత బ్యాడ్మింటన్ టీమ్ థామస్ కప్లో కనీసం సెమీఫైనల్ చేరిన ధాఖలాలు లేవు. కానీ మేం టైటిల్ గెలిచాం.'అని చిరాగ్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు.