టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించి అతని చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరో ఐదేళ్ల పాటు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారని స్పష్టం చేశారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ భార్య పిల్లలతో లండన్లోనే సెటిల్ అవుతాడని, అక్కడే కాపురం పెడుతాడని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్కుమార్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. 'కోహ్లీ కుటుంబం ఈ ఏడాది ఎక్కువ కాలం లండన్లో గడిపింది. భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన తర్వాత కూడా కోహ్లీ ఫ్యామిలీతో యూకేలో గడిపాడు. అక్కడ కోహ్లీకి ఇల్లుతో పాటు ఆస్తులు ఉన్నాయి. భార్య పిల్లలతో లండన్లోనే సెటిలవ్వాలని కోహ్లీ యోచిస్తున్నాడు. అతి త్వరలోనే యూకేలో కోహ్లీ కాపురం పెట్టనున్నాడు. 'అని రాజ్కుమార్ శర్మ తెలిపారు.

గత కొన్నేళ్లుగా కోహ్లీ తరుచూ లండన్ వెళ్తుండటంతో ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కోహ్లీ, అనుష్క దంపతులకు కుమారుడు అకాయ్ లండన్లోనే జన్మించిన విషయం తెలిసిందే. ఇక విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ తర్వాతే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కూడా రాజ్కుమార్ శర్మ పేర్కొన్నారు.
'కోహ్లీ తన కెరీర్లో అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నాడు. తాజా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తొలి టెస్ట్లోనే శతకం బాదాడు. తదుపరి రెండు టెస్ట్ల్లోనూ అతను సెంచరీ చేస్తాడనే నమ్మకం ఉంది. కోహ్లీ ఎప్పుడూ ఆటను ఆస్వాదిస్తాడు. ఏ ఆటగాడైన తమ ఆటను ఆస్వాదిస్తే అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్ ఎలా చేయాలో కోహ్లీకి బాగా తెలుసు.
కోహ్లీ చాలా ఫిట్గా ఉన్నాడు. రిటైర్ అయ్యేంత వయసు అతనికి లేదు. మరో ఐదేళ్లపాటు క్రికెట్ ఆడుతాడని కచ్చితంగా చెప్పగలను. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాతే రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. కోహ్లీతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. కోహ్లీకి 10 ఏళ్లు రాకముందు నుంచే నాకు తెలుసు. అతనితో నాకు 26 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. అందుకే విరాట్ కోహ్లీ ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని చెబుతున్నా.'అని రాజ్కుమార్ శర్మ చెప్పుకొచ్చాడు.
రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్తో అతి త్వరలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. డబ్ల్యూటీసీ 2025 ఫైనల్తో ఈ స్టార్ ఆటగాళ్ల కెరీర్కు ఎండ్ కార్డ్ పడుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజ్కుమార్ శర్మ .. కోహ్లీ మరో ఐదేళ్లు కొనసాగుతాడని తెలిపారు.