రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ విచిత్రకర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను చేసిన తప్పిదం కారణంగా ఓ కిరాణ కొట్టు వ్యక్తితో పాటు ఆర్సీబీ దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇబ్బందుల పాలయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.
చత్తీస్ఘడ్లోని గరియాబంద్ జిల్లాకు చెందిన మనీష్ అనే వ్యక్తి కిరాణ కొట్టుతో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన స్నేహితుడు ఖేమ్ రాజ్తో కలిసి అతను ఒక కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చేశాడు. అది యాక్టివేట్ అయిన తర్వాత మొబైల్లో వేసి వాట్సాప్ ఇన్స్టాల్ చేశాడు. ప్రొఫైల్ పిక్గా రజత్ పటీదార్ ఫొటో రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏదైనా సాంకేతిక లోపం కావచ్చని అతను దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొద్ది సేపటికే ఆ నంబర్కు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుంచి వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ రావడం మొదలైంది.

ఇది ఏదో ప్రాంక్ అనుకున్న మనీష్.. ఎవరో తనను ఆట పట్టిస్తున్నారని అనుకున్నాడు. తన నెంబర్ వేరే వ్యక్తికి వెళ్లిందని గ్రహించిన రజత్ పటీదార్ దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. మనీష్కు ఫోన్ చేసి తాను రజత్ పటీదార్నని, ఆ నంబర్ తనదని, ఇచ్చేయాలని కోరాడు. ప్రాంక్గా భావించిన మనీష్.. తాను ధోనీని అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. తాను రజత్ పటీదార్నేని, కీలక వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, కావాలంటే స్థానిక పోలీసులను పంపిస్తానని వారితో చెప్పాడు.
అతను చెప్పిన 10 నిమిషాల వ్యవధిలోనే స్థానిక పోలీసులు మనీష్ ఇంటికి చేరుకున్నారు. దాంతో ఆశ్చర్యపోయిన మనీష్, ఖేమ్ రాజ్.. ఆ నంబర్ రజత్ పటీదార్దేనని నమ్మారు. తాను విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, రజత్ పటీదార్తో మాట్లాడానని మనీష్, ఖేమ్ రాజ్ ఎగిరి గంతేసారు. ఆ సిమ్ తిరిగిచ్చేసారు. తమ జన్మ ధన్యమైందని సంతోషం వ్యక్తం చేశారు.
సదరు ఫోన్ నంబర్ను రజత్ పటీదార్ 90 రోజులుగా ఉపయోగించలేదు. దాంతో టెలికాం రూల్స్ ప్రకారం ఆ కనెక్షన్ను రద్దు చేసి కొత్త కస్టమర్కు కేటాయించారు. ఈ క్రమంలోనే ఆ నంబర్ మనీష్కు చేరింది. ఈ విషయం తెలియక కోహ్లీ, ఏబీ డివిలియర్స్.. రజత్ పటిదార్తో మాట్లాడేందుకు ఆ నంబర్కు ఫోన్ చేశారు.