
లండన్: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా దుమ్మురేపుతున్నాడు. జిడ్డు బ్యాటింగ్కు కేరాఫ్ అడ్రస్ అయిన పుజారా.. ఇంగ్లండ్ గడ్డపై విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. టెస్ట్ ఫార్మాటే కాదు పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా ఆడే సత్తా తనకు ఉందని చాటి చెబుతున్నాడు. రాయల్ లండన్ వన్డే కప్లో సస్సెక్స్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు.
ఇప్పటికే ఈ టోర్నీలో రెండు సెంచరీలు బాదిన పుజారా.. తాజాగా మూడో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం మిడిల్సెక్స్ టీమ్తో జరిగిన మ్యాచ్లో పుజారా 20 ఫోర్లు, 2 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. 75 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్గా 90 బంతులు ఎదుర్కొని 132 పరుగులు చేశాడు. పుజారా విధ్వంసకర బ్యాటింగ్తో సస్సెక్స్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 400 పరుగులు భారీ స్కోర్ చేసింది.
వార్విక్షైర్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో కూడా పుజారా 73 బంతుల్లోనే మెరుపు శతకంతో చేలరేగాడు. అదేవిధంగా సుర్రేతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 174 పరుగులు చేసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇక రాయల్ లండన్ వన్డే కప్-2022లో 500 పరుగుల మార్క్ను ధాటిన రెండో బ్యాటర్గా పుజారా నిలిచాడు. అనంతరం 401 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన మిడిల్ సెక్స్ టీమ్ 166 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
సౌతాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమైన చతేశ్వర్ పుజారా టీమిండియాలో చోటు కోల్పోయాడు. కౌంటీ క్రికెట్లో ఆడి ఫామ్ అందుకున్న అతను మళ్లీ శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడినా పెద్దగా రాణించలేదు. అయితే టీ20 ఫార్మాట్కు ఉన్న ఆదరణ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్పై పుజారా ప్రత్యేక దృష్టిసారించాడు. వచ్చే ఐపీఎల్ బరిలోకి దిగడమే లక్ష్యంగా సన్నదమవుతున్నాడు. ఈ క్రమంలోనే రాయల్ లండన్ కప్ బరిలోకి దిగి సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్ మెగా వేలంలో పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. గతేడాది చెన్నై అతని కనీస ధర రూ.50 లక్షలకు తీసుకున్నా.. ఈ సారి ఆ సాహసం చేయలేకపోయింది.