టీమిండియా భవిష్యత్తు కోసం కెప్టెన్ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ స్లాట్ను త్యాగం చేయాలని వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా అన్నాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శనివారం నుంచి గబ్బా స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్ట్ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి.
వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్కు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో టెస్ట్తో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. కేఎల్ రాహుల్ కోసం తన ఓపెనింగ్ స్లాట్ను త్యాగం చేసి మిడిలార్డర్లో ఆడాడు. కానీ రెండు ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు.

రోహిత్ ఒత్తిడిలో ఉన్నాడు..
మూడో టెస్ట్కు ముందు ఓ స్పోర్ట్స్ ఛానెల్తో మాట్లాడిన చతేశ్వర్ పుజారా.. రోహిత్ శర్మ తన ఓపెనింగ్ స్లాట్ను శాశ్వతంగా త్యాగం చేయాలని సూచించాడు. అంతేకాకుండా తన ఫుట్వర్క్ను కూడా మెరుగుపరుచుకోవాలని సలహా ఇచ్చాడు. 'న్యూజిలాండ్తో సిరీస్లో రోహిత్.. ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ శుభారంభం అందుకోలేకపోయాడు.
కాబట్టి మెరుగ్గా రాణించాలనే ఒత్తిడి అతనిపై ఉంటుంది. కానీ రోహిత్ ఆట గురించి అతనికే బాగా తెలుసు కాబట్టి సానుకూలంగా ఉండాలి. ఫుట్వర్క్పై ఫోకస్ పెట్టాలి. ఫుట్ వర్క్ మెరుగుపరుచకుంటే రోహిత్ శర్మ రాణించగలడు.
నెట్స్లో ఫోకస్ పెట్టాలి..
స్టంప్ లైన్ రోహిత్ను బాగా ఇబ్బంది పెడుతోంది. అతను ఎక్కువగా క్లీన్ బౌల్డ్ అవ్వడం లేదా ఎల్బీగా వెనుదిరుగుతున్నాడు. ఇది కాస్త ఆందోళన పరిచే విషయమే. నెట్స్లో ఈ సమస్యపై రోహిత్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ను రోహిత్ శర్మ ఇబ్బంది లేకుండా ఆడుతున్నాడు. రోహిత్ నెంబర్ 6లోనే బ్యాటింగ్ కొనసాగించాలి.
ఓపెనింగ్ స్లాట్ వదులుకోవాలి..
భారత జట్టు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ మాట చెబుతున్నా. తొలి టెస్ట్లో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. అద్భుతంగా రాణించారు. నెంబర్ 3లో శుభ్మన్ గిల్ కూడా మెరుగ్గా రాణించాడు. టీమిండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రోహిత్ నెంబర్ 6లో బ్యాటింగ్ చేయాలి.'అని చతేశ్వర్ పుజారా చెప్పుకొచ్చాడు.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో రాహుల్-యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు తొలి వికెట్కు 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దాంతో ఈ మ్యాచ్లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రెండో టెస్ట్లో మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ గబ్బా వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానుంది.