
న్యూఢిల్లీ: పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్పై టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ప్రశంసల జల్లు కురిపించాడు. మహమ్మద్ రిజ్వాన్ టాలెంటెడ్ ప్లేయరంటూ కితాబిచ్చాడు. ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పుజారా వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా.. రాయల్ లండన్ వన్డే కప్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన పుజారా.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
కౌంటీ చాంపియన్షిప్లో పుజారా, మహ్మద్ రిజ్వాన్లు ససెక్స్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మహ్మద్ రిజ్వాన్తో కలిసి కౌంటీ ఆడడంపై మీ అభిప్రాయం ఏంటి అని ఒక అభిమాని ట్విటర్ వేదికగా పుజారాను ప్రశ్నించాడు. ఈ సందర్బంగా కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా రిజ్వాన్తో కలిసి ఆడిన క్షణాలను పుజారా గుర్తు చేసుకున్నాడు.
'మహ్మద్ రిజ్వాన్ మంచి టాలెంటెడ్ క్రికెటర్. అతనితో కలిసి ఆడిన సందర్భాన్ని చాలా ఎంజాయ్ చేశాను. వ్యక్తిగతంగానూ చాల మంచోడు.'' అని పుజారా బదులిచ్చాడు. ఇక వన్డే క్రికెట్కు ఆదరణ తగ్గిపోతుందని అంటున్నారు.. దీనిపై మీరేమంటారు అని మరొక అభిమాని ప్రశ్నించాడు. దీనికి పుజారా..'' అవును వన్డే క్రికెట్ ఆదరణ కోల్పోవడం దురదృష్టకరం.'' అంటూ సమాధానమిచ్చాడు.
ఇక ఇంగ్లండ్తో టెస్టు ముగిసిన అనంతరం కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొన్న పుజారా వరుస సెంచరీలతో హోరెత్తించాడు. ఆ తర్వాత రాయల్ లండన్ వన్డే కప్లోనూ పుజారా బ్యాటింగ్లో ఇరగదీస్తున్నాడు. మంగళవారం మిడిలెసెక్స్తో జరిగిన మ్యాచ్లో పుజారా కేవలం 90 బంతుల్లోనే 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో పుజారా స్ట్రైక్ రేట్ 146.66 దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతను ఎంత భీకరమైన ఫామ్లో ఉన్నాడనేది.. ఇటివలే లిస్ట్-ఏ క్రికెట్లోనూ పుజారా 5వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు.
ఆసియా కప్ కోసం టీమిండియా దుబాయ్లో సాధన చేస్తోంది. ఆదివారం పాక్తో జరిగే మ్యాచ్తో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.