న్యూఢిల్లీ: జీవితం చాలా కష్టంగా ఉందని బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. తనకు ఎవరూ సహకారం అందించడం లేదని, ఆ దేవుడే అండగా నిలవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. ఓ చానెల్ స్ట్రింగ్ ఆపరేషన్లో సోయిలేకుండా బోర్డు అంతర్గత వ్యవహారాలు మాట్లాడిన చేతన శర్మ.. చీఫ్ సెలెక్టర్ పదవిని కోల్పోయాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మధ్య ఉన్న విభేదాలను ప్రస్తావించాడు. భారత క్రికెటర్ల ఫిట్నెస్ వ్యవహారలతో పాటు బోర్డు అంతర్గత వ్యవహారాలను బయటపెట్టాడు. ఈ విషయాలన్నీ బయటకు రావడం.. తీవ్ర విమర్శలు రావడంతో సెలెక్టర్ పదవికి రాజీనామా చేశాడు.

అయితే చేతన్ శర్మ తప్పించాలనే కుట్రతోనే బోర్డు పెద్దలు ఈ స్ట్రింగ్ ఆపరేషన్కు తెరలేపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న చేతన్ శర్మ తాజాగా ట్విటర్ వేదికగా నోరు విప్పాడు.
'ఇప్పటిదాకా గడిచిన జీవితం చాలా కష్టంగా తోచింది. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఎలాంటి సహకారం లేదు. ఆ మాతా రాణి ఆశీర్వాదాలైనా నాపై ఉంటాయని ఆశిస్తున్నా'అని చేతన్ శర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్తో చేతన్ శర్మ డిప్రెషన్లో ఉన్నట్లు అర్థం చేసుకున్న నెటిజన్లు అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
టీ20 ప్రపంచకప్ అనంతరమే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసింది. ఆ తర్వాత కమిటీ సభ్యులను మార్చిన బీసీసీఐ చైర్మన్గా మాత్రం అతన్నే కొనసాగించింది. జై షా అండదండలతోనే చేతన్ శర్మకు పదవి దక్కిందని ప్రచారం జరిగింది. కానీ చేతన్ శర్మ స్ట్రింగ్ అపరేషన్తో అడ్డంగా బుక్కై పదవిని కోల్పోయాడు.