నాన్న ఉంటే బాగుండేది..
ప్రస్తుతం చెన్నైలో ఎమ్ఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ తరఫున సాధన చేస్తున్న సకారియా.. టీమిండియా పిలుపుపై స్పందించాడు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల వల్లే ఇది సాధ్యమైందన్నాడు. 'ఈ సంతోషకరమైన సమయంలో నాన్న ఉంటే బాగుండేది. నేను టీమిండియాకు ఆడాలని ఆయన కోరుకునేవాడు.
ఈ రోజు మా నాన్నను ఎంతో మిస్సవుతున్నా. ఈ ఏడాది కాలంలోనే ఆ దేవుడు నాకు కష్టాలతో పాటు సంతోషకర క్షణాలను అందించాడు. మా తమ్ముడు మరణించి మరుసటి నెలలోనే నాకు బిగ్ ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కింది. గత నెలలో మా నాన్న దూరమయ్యాడు. ఇప్పుడు టీమిండియా పిలుపు అందింది. మా నాన్నతో ఆసుపత్రిలో ఏడు రోజులున్నాను. ఆ బాధ వర్ణాతీతం. ఇదంతా నా దివంగత తండ్రి, మా అమ్మ వల్లే. వారే నా ఆటకు అడ్డు చెప్పలేదు.'అని సకారియా భావోద్వేగానికి గురయ్యాడు.
రూ. 1.20 లక్షలకు..
రూ.20 లక్షల కనీస ధరతో ఐపీఎల్ 2021 సీజన్ వేలంలోకి వచ్చిన చేతన్ సకారియాను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.20 లక్షలు భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో మొత్తం 7 మ్యాచ్లు ఆడిన సకారియా స్టన్నింగ్ పెర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన అరంగేట్ర మ్యాచ్లోనే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వికెట్లను తీసి అందరి దృష్టి ఆకర్షించాడు.
8.22 ఎకానమీతో మొత్తం 7 వికెట్లు తీశాడు. ఐపీఎల్ తర్వాత జనాలు తన గురించి మాట్లాడుకుంటుంది విని భారత జట్టుకు కనీసం నెట్ బౌలర్గా అయినా సేవలందించే అవకాశం దక్కుతుందని భావించానని సకారియా చెప్పుకొచ్చాడు. కానీ ఏకంగా టీమిండియాకే ఆడే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేశాడు.
లంక వెళ్లే భారత జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా.