Chess Olympiad: చదరంగంలా మారిన చెన్నై.. సూపరో సూపర్ అంటున్న చెస్ దిగ్గజాలు!

చెన్నై: చదరంగ బోర్డును ప్రతిబింబించేలా నలుపు, తెలుపు గళ్లతో నిండిపోయిన రహదారులు.. పావులతో ఆకర్షణీయంగా మారిన వేదిక.. దేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని చాటే ప్రదర్శనలు.. తమిళనాడు ఘన వారసత్వాన్ని తెలిపే దృశ్యాలు.. మనసును మైమరిపించే సంగీతం.. తనువును ఆడించే నృత్యాలు.. ఇలా అంగరంగ వైభవంగా విశ్వ చెస్ సమరానికి తెరలేచింది. చదరంగం పుట్టిన దేశంలో.. మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ ఆరంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఈ పోటీలు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం ఎంతో ఘనంగా ఆరంభమయ్యాయి. సంగీత ప్రదర్శనతో మొదలు ఇసుకతో చిత్రాలు, పోటీల్లో పాల్గొనే దేశాల పతాక రెపరెపలు.. క్రీడాకారుల కవాతు.. ఇలా ఆద్యంతం కార్యక్రమం గొప్పగా సాగింది. గత తమిళనాడు రాజుల ఘనతలు, వారి సంప్రదాయం, సంస్కృతి, ప్రాచీన క్రీడలను ప్రతిబింబించే ప్రదర్శనలు, వీడియోలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ నృత్య రూపాలకు తన గొంతునందించారు.
భారత దేశ ఎనిమిది సంప్రదాయ నృత్య కళలను ప్రదర్శించారు. సంప్రదాయ వస్త్రాలంకరణలో భారత ప్లేయర్లు తళుక్కుమన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొక్కా, పంచె ధరించి.. నలుపు, తెలుపు గళ్లతో కూడిన కండువాను వేసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఆయనకు స్వాగతం పలుకుతూ రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రజలు 'వణక్కమ్ మోదీ' నినాదాలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా సంప్రదాయ వస్త్రాలు ధరించారు.
అయితే ఈ ఆరంభ వేడుకలను చూసి అంతర్జాతీయ చెస్ ప్లేయర్లు అవాక్కవుతున్నారు. దేశం మొత్తం చెస్ ఫీవర్తో ఊగిపోతుందని, ఇక్కడి ఏర్పాట్లు, వసతులు తమకు బాగా నచ్చాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ఇక్కడ ఆహారం చాలా బాగుందని, రహదారులు చదరంగ బోర్డులను తలపించడం ఆకట్టుకుంటుందని ట్వీట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications