
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన హైదరాబాద్, చెన్నై, కోల్కతా, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్స్కి చేరుకున్నాయి. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు చెన్నై సూపర్కింగ్స్-సన్రైజర్స్ హైదరాబాద్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం కామెంటేటర్గా ఉన్న మహమ్మద్ కైఫ్ ఈ సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్స్లో ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలుస్తుందని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఇందుకు ఓ విచిత్రమైన కారణాన్ని కైఫ్ తన ట్విట్టర్లో ట్వీట్ ద్వారా వివరించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో లీగ్ దశలో ఢిల్లీ డేర్ డెవిల్స్ చివరి స్థానంలో ముగిసిన సీజన్లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టు విజేతగా నిలిచింది. 2011 సీజన్లో చెన్నై, 2013లో ముంబై, 2014 సీజన్లో కోల్కతా విజేతలుగా నిలిచాయి.
ఈ మూడు సీజన్లలో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. దీంతో ఈ సీజన్లోనూ ఢిల్లీ జట్టు చివరి స్థానంలో ఉండటంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంటుందని కైఫ్ ట్వీట్ చేశాడు.