
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో వరుసగా నాలుగు పరాజయాలతో చతికిలపడ్డ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు గట్టి షాక్ తగిలింది. లీగ్లోని సగం మ్యాచ్ల తర్వాత అందుబాటులోకి వస్తాడని భావించిన స్టార్ పేసర్ దీపక్ చాహర్.. లీగ్ మొత్తానికి దూరమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న దీపక్ చాహర్కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను వెన్నుగాయంతో బాధపడుతున్నట్లు ఎన్సీఏ వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో అతను మరో నెల రోజుల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం. ఈలోపు ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుంది కాబట్టి చాహర్ సీజన్ మొత్తానికే దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై సీఎస్కే మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో తొడ కండరాల గాయానికి గురైన దీపక్ చాహర్ గత నెల రోజులుగా ఎన్సీఏ రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. మెగా టోర్నీలో చాలా మ్యాచ్లు మిస్సవుతాడని ముందుగా ప్రచారం జరిగినా.. దీపక్ చాహల్ త్వరగా కోలుకుంటున్నాడని, ఏప్రిల్ 25వరకు అందుబాటులోకి వస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. ఈ ఏడాది అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో దీపక్ చాహర్ది రెండో స్థానం. అతడి కోసం చెన్నై రూ. 14 కోట్లు వెచ్చించింది. ఇటీవల అతను బ్యాట్ కూడా ఝులిపిస్తుండటంతో దీపక్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా వెన్ను గాయానికి గురవడంతో చెన్నై అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. దీపక్ చాహర్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. అతని స్థానంలో ఆడించిన బౌలర్లు ఎవరూ రాణించలేకపోతున్నారు. ఇప్పటికే తుషార్ దేశ్ పాండే, ముఖేశ్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణలకు అవకాశం ఇచ్చిన లాభం లేకపోయింది. నేడు ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో చెన్నై.. చివరి అస్త్రంగా రాజవర్దన్ హంగర్గేకర్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆర్సీబీతో మ్యాచ్లో అతనికి చోటు దక్కవచ్చు. గత మ్యాచ్లో విఫలమైన మహీశ్ తీక్షణను కూడా పక్కనపెట్టే చాన్సుంది. మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.