ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 సీజన్కు సంబంధించిన మినీ వేలానికి ముహుర్తం ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. డిసెంబర్ 13-15 మధ్య వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 10 జట్లు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించేందుకు నవంబర్ 15వ తేదీని డెడ్లైన్గా విధించినట్లు సమాచారం. దాంతో ఏయే జట్టు ఎవరిని వదిలేస్తుందో అనే అంచనాలు మొదలయ్యాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురి ఆటగాళ్లను వదిలేస్తుందని ప్రముఖ వెబ్సైట్ క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. ఐపీఎల్ 2025 సీజన్లో విఫలమైన సామ్ కరణ్, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, డేవన్ కాన్వేలను రిలీజ్ చేస్తుందని అంచనా వేసింది. అయితే ఈ జాబితాపై అభిమానులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కాన్వే, కరన్లను కొనసాగించాలని కొందరు డిమాండ్ చేయగా.. మరికొందరు వదిలేయాలని సూచించారు. దాంతో సీఎస్కే ఈ జాబితాపై స్పందించింది. క్రిక్బజ్ రిపోర్ట్ను తప్పుబట్టింది. ఎవరూ కంగారు పడొద్దు. మేమే అప్డేట్ ఇస్తామని పేర్కొంది. ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచిన సీఎస్కే ఎక్కువ మొత్తం ఆటగాళ్లను వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జట్టు పర్స్లో రూ.9.75 కోట్లు మిగలనున్నాయి.
టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2026 ఆడుతాడా? లేదా? అనే విషయంపై కూడా సందిగ్దత నెలకొంది. ఇప్పటి వరకు అయితే అతను ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. టోర్నీ ఆరంభానికి ముందు తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పాడు. గత ఐదు సీజన్లుగా ధోనీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ అతను ప్రతీ సీజన్లో బరిలోకి దిగి అభిమానులను అలరించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో అనామక ఆటగాడిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఒకవేళ ధోనీ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించినా.. మెంటార్గా సీఎస్కేకు సేవలు అందించే ఛాన్స్ ఉంది.
ఐపీఎల్ వేలం జరిగే వేదికతో పాటు తేదీలపై బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. గత రెండు సీజన్లకు సంబంధించిన వేలం విదేశాల్లో జరగ్గా.. ఈసారి స్వదేశంలో నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. వేలం కోసం ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, వైజాగ్ నగరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.