టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో అశ్విన్(112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 102 బ్యాటింగ్) సెంచరీ సాధించాడు. ఇది అశ్విన్కు 6వ టెస్ట్ సెంచరీ కాగా.. చెన్నై వేదికగా వరుసగా రెండోది. అశ్విన్ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 80 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది.
144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును రవీంద్ర జడేజా(117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 86 బ్యాటింగ్)తో కలిసి అశ్విన్ ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు అజేయంగా 195 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో అశ్విన్ పలు రికార్డులను తన పేరిట లిఖంచుకున్నాడు.

ధోనీ రికార్డ్ సమం..
టెస్ట్ల్లో 6వ శతకంతో దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డ్ను అశ్విన్ సమం చేశాడు. టెస్ట్ల్లో ధోనీ కూడా 6 శతకాలు సాధించాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ధోనీ కంటే అశ్విన్కే ఎక్కవ ఓవర్సీస్ సెంచరీలు ఉన్నాయి. సొంతగడ్డపై నాలుగు శతకాలు నమోదు చేసిన అశ్విన్.. వెస్టిండీస్లో రెండు సెంచరీలు చేశాడు. మరోవైపు ధోనీ మాత్రం భారత్లో ఐదు, పాకిస్థాన్ ఒక సెంచరీ కొట్టాడు.
అత్యుత్తమ భాగస్వామ్యం..
టెస్ట్ క్రికెట్లో భారత్కు లోయరార్డర్ అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే. ఓవరాల్ రికార్డ్ శిఖర్ ధావన్, మురళీ విజయ్ పేరిట చెక్కుచెదరకుండా ఉంది. 2015లో ఈ ఇద్దరూ 283 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్-గౌతమ్ గంభీర్ 259 పరుగులు, రాహుల్ ద్రవిడ్-సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ-అజింక్యా రహానే 222 పరుగులు భాగస్వామ్యాలను నమోదు చేశారు. ప్రస్తుతం అశ్విన్-జడేజా 195 పరుగుల అజేయ భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. మరో 89 పరుగులు చేస్తే శిఖర్ ధావన్-మురళీ విజయ రికార్డ్ బ్రేక్ అవుతోంది.
సొంతగడ్డపై బంగ్లాదేశ్తో...
సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండో అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది. 2016-17లో కోహ్లీ-రహానే 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ తరఫున రెండు శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా కూడా జడేజా-అశ్విన్లు రికార్డ్ కెక్కారు. గతంలో ఫరూక్ ఇంజనీర్-బాపు, రవిశాస్త్రి-సయ్యద్ కిర్మాణీ, రోజర్ బిన్నీ-మదన్ లాల్, ధోనీ-వీవీఎస్ లక్ష్మణ్ ఈ రికార్డ్ సాధించారు. చెన్నై వేదికగా ఇదే అత్యుత్తమ ఏడో వికెట్ భాగస్వామ్యం.