హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తో సోమవారం జరిగిన హోరా హోరీ ఫైనల్లో చెన్నై చిరస్మరణీయ విజయాన్నందుకుంది. చివరి 2 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో రవీంద్ర జడేజా సంచలన బ్యాటింగ్తో చెన్నై గెలుపొందింది.
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఐదో సారి ఛాంపియన్గా నిలిచిన చెన్నై అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. 2010, 2011, 2018, 2021 సీజన్లతో పాటు తాజా 2023 సీజన్లో చెన్నై ఛాంపియన్గా నిలిచింది. అయితే 2011లో చెన్నై ఛాంపియన్గా నిలవగా టీమిండియా 28 ఏళ కలను సాకారం చేస్తూ వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.

ఈ క్రమంలోనే ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే ఈ ఏడాదే జరిగే వన్డే ప్రపంచకప్ను రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా గెలుచుకుంటుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 2011 ఐపీఎల్ సీజన్, వన్డే ప్రపంచకప్ పరిస్థితులు.. తాజా 2023 సీజన్లోని పరిస్థితులు ఒకేలా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
ఐపీఎల్ 2011 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరి ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిందని, క్వాలిఫయర్-2లో మాత్రం ఓడి ఇంటిదారి పట్టిందని, ఫైనల్లో చెన్నై గెలిచి టైటిల్ ముద్దాడిందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఆ ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ జరగ్గా టీమిండియా ఛాంపియన్గా నిలిచిందని కామెంట్ చేస్తున్నారు.

ఈ సారి కూడా ఇదే ఫలితం రిపీట్ అయిందంటున్నారు. చివరి నిమిషంలో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై.. ఎలిమినేటర్లో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించిందని, క్వాలిఫయర్-2లో మాత్రం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టిందని కామెంట్ చేస్తున్నారు. అప్పటిలా ఫైనల్లో చెన్నై విజయం సాధించి టైటిల్ గెలిచిందని, వన్డే ప్రపంచకప్ కూడా భారత్ వేదికగా జరగబోతుందని గుర్తు చేస్తున్నారు.
ఈ లెక్కన మళ్లీ భారతే వన్డే ప్రపంచకప్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 18 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుండగా.. 10 జట్లు మొత్తం 48 మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ 10 వేదికలను షార్ట్ లిస్ట్ చేసింది. అతి త్వరలోనే పూర్తి షెడ్యూల్ను వెల్లడించనుంది.