కోచ్గా సాధించి..
కెప్టెన్గా సాధించలేకపోయిన చంద్రకాంత్ పండింట్ కోచ్గా సాధించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. చంద్రకాంత్కు కోచ్గా ఇది ఆరో రంజీ ట్రోఫీ టైటిల్. ముంబై జట్టును మూడు సార్లు చాంపియన్గా నిలబెట్టిన చంద్రకాంత్.. ద్వితీయ శ్రేణి జట్టుగా ముద్రపడిన విదర్భ టీమ్కు రెండు సార్లు టైటిల్ అందించాడు. ఎన్నో ఏళ్లు నిరీక్షణకు తెరదించుతూ.. తన మధ్యప్రదేశ్ జట్టు ముచ్చటా తీర్చాడు. కోచ్గా ఇంతటి గ్రాండ్ రికార్డు ఉన్న చంద్రకాంత్ ఇప్పటివరకు భారత క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్లో భాగమవ్వలేదు. తాజాగా ఇదే విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించగా.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు
వాళ్ల కింద పని చేయడం ఇష్టం లేక..
'నేను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీని సంప్రదించినా వాళ్లు నాకు కచ్చితంగా కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తారు. కానీ అది నా పద్ధతి కాదు. నేను 2012లో కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ను కలిశాను. అయితే అప్పుడు ఆయన నాకు కోచింగ్ టీమ్లోకి రమ్మన్నారు. కానీ నేను మాత్రం అంగీకరించలేదు. నేను విదేశీ కోచ్ల కింద పని చేయదలుచుకోలేదు.' అని చెప్పాడు. 2012లో కేకేఆర్కు ట్రెవర్ బెయిలిస్ హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్.. 2015 నుంచి 2019 వరకు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు కోచ్ గా పనిచేశాడు. అతని కింద పనిచేయడానికి చంద్రకాంత్ అంగీకరించలేదు.
ఇది చాలా స్పెషల్..
ఇక తాను ఇప్పటికీ ఐదు టైటిళ్లు గెలిచినా.. తాజా ట్రోఫీ మాత్రం ప్రత్యేకమని చెప్పాడు.'నా కెరీర్ లో ముంబైకి హెడ్ కోచ్ గా పనిచేసినప్పుడు 3 ట్రోఫీలు, విదర్భకు 2, మధ్యప్రదేశ్ కు 1 అందించాను. వీటిలో వేటికవే ప్రత్యేకం. కానీ ఇటీవల మధ్యప్రదేశ్ కు టైటిల్ అందించడం మాత్రం నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది నా సొంత జట్టు. గతంలో కెప్టెన్ గా ఉండి నేను సాధించలేనిది ఇప్పుడు సాధించుకున్నాను. ఇన్నాళ్లు నాకు అది చాలా వెలితిగా ఉండేది. కానీ ఇప్పుడది తీరిపోయింది..'అని చంద్రకాంత్ పండిట్ చెప్పుకొచ్చాడు.