
దుబాయ్: ఆసియాకప్ 2022లో టీమిండియా ఘోర పరాజాయాన్ని చవిచూసింది. శ్రీలంకతో మంగళవారం జరిగిన డూఆర్డై మ్యాచ్లో సమష్టిగా విఫలమైన రోహిత్ సేన 6 వికెట్లతో చిత్తుగా ఓడి ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లీగ్ దశలో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి జోరు కనబర్చిన టీమిండియా.. సూపర్ 4లో మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. ఇక టోర్నీలో భారత్.. అఫ్గానిస్థాన్తో రేపు (గురువారం) చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో గెలిచినా రోహిత్ సేనకు ఫైనల్ చేరే అవకాశాలు 99.9 పర్సెంట్ లేవు. అద్భుతం జరిగితే తప్పా టీమిండియా ఫైనల్ చేరుకోలేదు.
ఒక వేళ భారత్ ఫైనల్ చేరాలంటే ఈ రోజు(బుధవారం) రాత్రి 7.30 గంటలకు పాకిస్థాన్తో జరగనున్న మ్యాచ్లో అఫ్గానిస్థాన్ స్వల్ప తేడాతో గెలుపొందాలి. ఆ తర్వాత భారత్తో అప్గాన్ చిత్తుగా ఓడాలి. భారీ పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధిస్తే రన్ రేట్ మెరగవుతోంది. అప్పుడే ఫైనల్ రేసులో అవకాశం ఉంటుంది. ఇక శుక్రవారం చివరి సూపర్ 4 లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్పై భారీ తేడాతో శ్రీలంక విజయం సాధించాలి.
అదే జరిగితే.. మూడింటికి మూడు మ్యాచ్లు గెలిచిన శ్రీలంక ఫైనల్ చేరనుండగా.. ఒక్కో విజయం సాధించిన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, భారత్ జట్లలో మెరుగైన రన్ రేట్ కలిగిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశం దక్కుతుంది. కాబట్టి అఫ్గాన్పై భారీ విజయం సాధించడం భారత్కు ఎంత ముఖ్యమో.. ఇతర జట్లు మెరుగైన రన్ రేట్ లేకుండా ఒడిపోవడం కూడా అంతే ముఖ్యం. అయితే ఇది జరగడం అసాధారణం. టీమిండియా తలరాత బాగుండి అద్భుతం జరిగితే తప్పా రోహిత్ సేన ఫైనల్ చేరేలా ఇది జరగడం అసంభవం. ముఖ్యంగా పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓటమిపాలవ్వడం కష్టం.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 72), సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో ఫోర్, సిక్సర్తో 34) రాణించారు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక మూడు వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, డసన్ షనక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మహీశ్ తీక్షణ ఓ వికెట్ తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 174 పరుగుల చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 52), కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. భానుక రాజపక్స( 17 బంతుల్లో 2 సిక్సర్లతో 25 నాటౌట్), డసన్ షనక(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్తో 33 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.