న్యూఢిల్లీ: 2019 వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి తెలుగు తేజం అంబటి రాయడిని తప్పించడంలో అప్పటి చీఫ్ సెలెక్టర్, ఆంధ్ర మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ పాత్ర ఏం లేదని మాజీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చాముండేశ్వరి నాథ్ అన్నారు. టీమ్ సెలెక్షన్లో ఒక్కరి పాత్ర ఉండదని, టీమ్ కెప్టెన్, కోచ్తో పాటు ఐదుగురు సెలెక్టర్లు కలిసి జట్టును ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు.
ఓ ఆటగాడి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం లేనప్పుడు.. మెజార్టీ సభ్యులు వద్దని చెప్పినప్పుడు చీఫ్ సెలెక్టర్ కూడా ఏం చేయలేడని చాముండేశ్వరి నాథ్ తెలిపారు. రాయుడిన తప్పించడంలో ఎమ్మెస్కే పాత్ర ఏ మాత్రం లేదన్నారు. ఐపీఎల్ 2023 సీజన్తో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఓ ప్రముఖ తెలుగు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, హైదరాబాద్ మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ తన కెరీర్కు అడ్డుపడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. యువ క్రికెటర్గా ఉన్నప్పుడు సీనియర్ ఆటగాళ్లతో వచ్చిన విభేదాలు కెరీర్ మొత్తం వెంటాడాయని చెప్పారు. శివలాల్ యాదవ్ తన కొడుకు కోసం చాలా ఇబ్బంది పెట్టాడని రాయుడు ఆరోపించారు.
ఇక 2019 వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి తనను తప్పించినప్పుడు చాలా నిరాశకు గురయ్యానని చెప్పిన రాయుడు.. ఇందులో ఎమ్మెస్కే పాత్ర కూడా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర తరఫున ఆడే సమయంలో ఎమ్మెస్కేతో తనకు విభేదాలు ఉన్నాయని తెలిపారు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారో ఎమ్మెస్కే ప్రసాద్నే అడగాలన్నారు.
ఈ వ్యాఖ్యలపై మాజీ చీఫ్ సెలెక్టర్ చాముండేశ్వరి నాథ్ వివరణ కోరగా.. అతను ఎమ్మెస్కే పాత్ర ఏం లేదని స్పష్టం చేశారు. అంబటి రాయుడి ఎంతో నైపుణ్యం కలిగిన ఆటగాడని కొనియాడిన చాముండేశ్వరి.. అతని కోసం అనురాగ్ ఠాకూర్తో కూడా గొడవపడ్డానని గుర్తు చేసుకున్నారు. 'అంబటి రాయుడు ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు.
అయితే అతను సెలెక్షన్ మ్యాచ్ల్లో స్కోర్లు కొట్టేవాడు కాదు. కానీ అతని టాలెంట్ చూసి అండర్ 19 కెప్టెన్గా ఎంపిక చేశాను. ఇంగ్లండ్లో ఓపెనర్గా వెళ్లిన రాయుడు ఒంటి చేత్తో 177 పరుగులతో జట్టును గెలిపించాడు. రాయుడి గురించి అప్పటి టీమిండియా హెడ్ కోచ్ జాన్ రైట్ రాయుడు మంచి ఫీల్డర్ అని కొనియాడేవాడు. ఫీల్డింగ్లో మహమ్మద్ కైప్, మహమ్మద్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్లు ముగ్గురు కలిపితే రాయుడు అని కొనియాడేవాడు.

రాయుడు విషయంలో అనురాగ్ ఠాకూర్తో నాకు ఎప్పుడూ గొడవ జరిగేది. ఆయన అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ జగన్మోహన్ దాల్మియాకు నాపై ఫిర్యాదు చేసేవాడు. పరుగులు చేయకున్నా రాయుడిని చాముండీ సెలెక్ట్ చేస్తున్నాడనేవాడు. టాలెంట్తోనే సెలెక్ట్ చేశానని నేను దాల్మియాకు వివరణ ఇచ్చుకున్నాను.
ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో ఆడిన అంబటి రాయుడి నిషేధం ఎత్తివేసిన తర్వాత ముంబై ఇండియన్స్లోకి తీసుకోమని సచిన్ టెండూల్కర్కు నేనే చెప్పాను. అండర్ 19 క్రికెట్ ఆడిన తర్వాత కూడా షూస్, క్రికెట్ కిట్ను సచిన్ సాయంతో పంపించాను. అయితే రాయుడు సెలెక్టర్లు చూసే కీలకమైన మ్యాచ్ల్లో పరుగులు చేసేవాడు కాదు.
2019 వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి రాయుడిని తప్పించడంలో ఎమ్మెస్కే పాత్ర లేదు. దురదృష్టవశాత్తు అతనికి చోటు దక్కలేదు. ఎంత చీఫ్ సెలెక్టర్ అయినా.. ఇతర సభ్యుల ఆమోదం లేకుండా ఓ ఆటగాడిని తప్పించడం.. తీసుకోవడం కుదరదు.'అని చాముండేశ్వరి నాథ్ చెప్పుకొచ్చారు.