ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ఓ పాకిస్థాన్ అభిమాని నిలదీసాడు. పాకిస్థాన్కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించాడు. దీనికి సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'అరే భాయీ.. మా చేతుల్లో ఏముంది?'అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై సందిగ్దత కొనసాగుతోంది. రోజుకో వార్త పాకిస్థాన్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ జట్టుకే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ను పీసీబీ.. ఐసీసీకి పంపించింది. మరోవైపు స్టేడియాల పునరుద్దరణ కోసం కూడా కోట్లు ఖర్చుపెట్టింది.

అయితే ఈ టోర్నీ కోసం పాకిస్థాన్లో పర్యటించలేమని, తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని ఐసీసీని భారత క్రికెట్ బోర్డు కోరింది. తమ ఆటగాళ్ల భద్రతా కారణాల నేపథ్యంలో పాక్లో పర్యటించలేమని, హైబ్రిడ్ మోడల్లో టోర్నీ ని నిర్వహించాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. మరోవైపు టీమిండియా పాకిస్థాన్లో పర్యటించేందుకు భారత ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం లేదు.
పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని నిర్వహించేందుకు అంగీకరించడం లేదు. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకుంటాం తప్పా.. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించలేమని స్పష్టం చేస్తోంది. భారత్ రాని పక్షంలో మరో జట్టుకు అవకాశం ఇవ్వాలని కూడా ఐసీసీని కోరినట్లు వార్తలు వచ్చాయి. తమ వాదనకు ఐసీసీ అంగీకరించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని కూడా పీసీబీ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా భారత్ రాకుంటే ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు వదులుకోవాలని పీసీబీని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఐసీసీ కూడా పీసీబీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్కు అంగీకరించకపోతే.. సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని చెప్పినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను అక్కడే ఉన్న ఓ పాకిస్థాన్ అభిమాని ప్రశ్నించాడు. ముందుగా సూర్యతో ఫొటో దిగిన సదరు అభిమాని.. తర్వాత పాక్లో ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించాడు.