ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ముగియడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఫోకస్ పెట్టింది. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్కే ఉండటంతో మ్యాచ్ల షెడ్యూల్పై కసరత్తు చేస్తోంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ నిర్వహించాల్సింది.
ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను పీసీబీ ఆమోదం కోసం ఐసీసీకి పంపించినట్లు తెలుస్తోంది. ఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు మార్చి 1న లాహోర్లోని గడ్డాఫి స్టేడియం వేదికగా తలపడాల్సి ఉంది. ఈ షెడ్యూల్కు ఐసీసీ ఆమోదం తెలిపినా.. బీసీసీఐ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్నఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ తమ ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంది. చివరిసారిగా 2008లో టీమిండియా.. పాకిస్థాన్లో పర్యటించింది. గత 16 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో భారత్-పాక్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.
పాకిస్థాన్ మాత్రం 2011 వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్ కోసం భారత్లో పర్యటించింది. టీమిండియా మాత్రం 2008 నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్లో పర్యటించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్లో కాకుండా తటస్థ వేదికలో నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతోంది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా టోర్నీ డ్రాఫ్ట్ షెడ్యూల్ను రూపొందించి ఐసీసీకి పంపించింది.
భారత్కు సంబంధించిన అన్ని మ్యాచ్లను లాహోర్ వేదికగా నిర్వహిస్తామని తమ డ్రాఫ్ట్ షెడ్యూల్లో పేర్కొంది. పీసీబీ ప్రతిపాదన ప్రకారం.. 20 రోజుల్లో మొత్తం 15 మ్యాచ్లు నిర్వహించనుంది. లాహోర్లో ఫైనల్తో సహా ఏడు మ్యాచ్లు, కరాచీలో మూడు, రావల్పిండిలో ఐదు మ్యాచ్లు నిర్వహిస్తామని పేర్కొంది.
పీసీబీ డ్రాఫ్ట్ షెడ్యూల్కు సంబంధించిన వివరాలను ఓ ఐసీసీ అధికారి ప్రముఖ మీడియా ఎజెన్సీకి తెలిపారు. 'ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోని 15 మ్యాచ్లకు సంబంధించిన డ్రాఫ్ట్ను ఐసీసీకి పీసీబీ అందజేసింది. లాహోర్లో ఏడు, కరాచీలో మూడు, రావాల్సిండిలో ఐదు మ్యాచ్లు నిర్వహిస్తామని పేర్కొంది. కరాచీలో ప్రారంభ మ్యాచ్, రావల్పిండి, కరాచీలో సెమీఫైనల్స్, లాహోర్లో ఫైనల్ జరుపుతామని తెలిపింది. టీమిండియాకు సంబంధించిన అన్ని మ్యాచ్లను లాహోర్లోనే నిర్వహిస్తామని పేర్కొంది. ఒకవేళ భారత్ సెమీస్ చేరితే ఆ మ్యాచ్ కూడా అక్కడే జరుపుతామని స్పష్టం చేసింది.
బీసీసీఐ మినహా అన్ని క్రికెట్ దేశాలు పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఒప్పుకున్నాయి. బీసీసీఐ తమ ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయాన్ని వెల్లడించనుంది.'అని సదరు ఐసీసీ అధికారి తెలిపాడు.