టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. దుబాయ్ వేదికగా జరిగే ఈ టోర్నీలో అతన్ని ఆడిస్తే టీమిండియాకు కీలకమవుతాడని చెప్పాడు. ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్లో వరుణ్ చక్రవర్తీ 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అయితే ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపిక చేసిన జట్టులో వరుణ్ చక్రవర్తీకి అవకాశం దక్కలేదు.
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వరుణ్ చక్రవర్తీ గురించి మాట్లాడిన అశ్విన్.. అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. వరుణ్ చక్రవర్తీని భారత వన్డే టీమ్లోకి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇప్పటి వరకు వన్డే క్రికెట్ ఆడని వరుణ్ చక్రవర్తీని ముందుగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడించాలన్నాడు. ఓ పేసర్ను తప్పించి మరీ వరుణ్ చక్రవర్తీని తీసుకోవాలని సెలెక్టర్లను కోరాడు.

'వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉండాలా? వద్దా? అనేది మాట్లాడుకుందాం. వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు అవకాశం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ టోర్నీ బరిలో నిలిచే జట్లు ప్రొవిజనల్ టీమ్స్ను మాత్రమే ప్రకటించాయి. మార్పులు చేర్పులకు ఇంకా అవకాశం ఉంది. కాబట్టి వరుణ్ చక్రవర్తీని తీసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టును గమనిస్తే.. ఒక పేసర్ను తప్పించి ఎక్స్ట్రా స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తీని తీసుకునే అవకాశం ఉంది. చక్రవర్తీ కోసం ఎవర్నీ తప్పించాలనేది నాకు తెలియదు. సెలెక్టర్లు ఏం చేస్తారో చూద్దాం.
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లోనూ వరుణ్ చక్రవర్తీని ఆడించాలి. అతన్ని నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడం అంత సులువైన పనికాదు. అతను ఇప్పటి వరకు వన్డే క్రికెట్ ఆడలేదు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇస్తారని అనుకుంటున్నా. ఈ సిరీస్లో ఆడించకుంటే అతను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికవ్వడం కష్టమే. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్న వరుణ్ చక్రవర్తీని అభినందిస్తున్నా. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అతనే చక్రవర్తి. అతను మరింత ఎదగాలని కోరుకుంటున్నా.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు తమ జట్లను ప్రకటించాయి. భారత్ నలుగురు స్పిన్నర్లతో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఫిబ్రవరి 11 వరకు జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే వరుణ్ చక్రవర్తీని జట్టులోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.