భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చెప్పినట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2024ని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు తాము మూర్ఖులం కాదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టం చేసింది. బీసీసీఐ సూచించినట్లు తాము హైబ్రిడ్ మోడల్లో నిర్వహించలేమని తెలిపింది. అలా చేస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. టీమిండియా వచ్చినా.. రాకున్నా పాకిస్థాన్ వేదికగానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
వరుసగా ఐసీసీ టోర్నీలు జరగడంతో పాటు కరోనా బ్రేక్ కారణంగా గత ఏడేళ్లుగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించలేదు. 2017లో చివరిసారిగా ఈ టోర్నీ జరగ్గా పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ను ఓడించి మరి తొలి టైటిల్ను అందుకుంది. చాలా రోజుల తర్వాత పాకిస్థాన్కు ఐసీసీ టోర్నీకి సంబంధించిన ఆతిథ్య హక్కులు దక్కాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ 2024ని ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ టోర్నీ కోసం స్టేడియాలను పునరుద్దరిస్తూ వందల కోట్లు ఖర్చు చేస్తోంది.
అయితే తమ ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో పాకిస్థాన్లో టీమిండియా పర్యటించలేదని, తమ మ్యాచ్లను తటస్థ వేదికలు అయిన శ్రీలంక లేదా యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో 2008 నుంచి భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ వంటి టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి.
ఈక్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ కోసమైన భారత్ వస్తుందని ఆదేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పాకిస్థాన్లో పర్యటించాలని టీమిండియాను అభ్యర్థిస్తున్నారు. పాకిస్థాన్ వేదికగానే జరగాల్సిన ఆసియాకప్ 2023లోనూ భారత్ పాల్గొనలేదు. దాంతో పీసీబీ హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని నిర్వహించింది.
శ్రీలంక వేదికగా భారత్ మ్యాచ్లను ఆడించింది. అయితే ఈ టోర్నీ కారణంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని పీసీబీ గగ్గోలు పెడుతోంది. మరోసారి అలాంటి తప్పిదం చేయదల్చుకోవడం లేదని స్పష్టం చేసింది.
పీసీబీకి చెందిన ఓ అధికారి బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మా క్రికెట్ స్టేడియాలను పునరుద్దరిస్తున్నాం. అప్గ్రేడ్ చేయడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ను పాకిస్థాన్ బయట నిర్వహించలేం. భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్లోనే నిర్వహిస్తాం.'అని సదరు అధికారి స్పష్టం చేశాడు.
అయితే టీమిండియాను కాదని పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించలేదని, ఐసీసీ, ఇతర దేశాలు కూడా అందుకు ఒప్పుకోవని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ లేకుండా ఈ టోర్నీని నిర్వహిస్తే ఐసీసీతో పాటు పీసీబీ కోట్లలో నష్టం వస్తుందని, యాడ్ రెవెన్యూ బాగా తగ్గుతోందని చెబుతున్నారు. అప్పుడు అధికారిక బ్రాడ్కాస్టర్స్ తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని, తద్వారా ఐసీసీ చెల్లించాల్సిన డబుల్లో కోత పెడుతాయని హెచ్చరిస్తున్నారు.