ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రావల్పిండి వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. ఉదయం నుంచే వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. ఔట్ ఫీల్డ్లో మొత్తం నీళ్లు చేరడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దాంతో టాస్ కూడా వేయకుండానే ఈ మ్యాచ్ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇప్పటికే ఈ టోర్నీ సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ తప్పుకున్న విషయం తెలిసిందే.
న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడిన ఆతిథ్య పాకిస్థాన్.. బంగ్లాదేశ్తోనైనా విజయం సాధించి తమ అభిమానులను సంతోష పెట్టాలని భావించింది. కానీ ఆ జట్టు ఆశలపై వరుణుడునీళ్లు జల్లాడు. దాంతో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీ బరిలోకి దిగిన పాకిస్థాన్.. ఒక్క విజయం సాధించకుండానే తమ ప్రస్థానాన్ని ముగించింది. 29 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్ దారుణమైన ప్రదర్శనతో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

మరోవైపు బంగ్లాదేశ్ సైతం భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్తో చివరి మ్యాచ్లోనైనా విజయం సాధించాలనుకుంది. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. గ్రూప్-ఏలో పాకిస్థాన్ అట్టడుగు స్థానంలో నిలవడం గమనార్హం. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో గ్రూప్-ఏ టాపర్ ఎవరో తెలియనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షంతో రద్దయ్యింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.