ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్లు రెండేసి విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి. అయితే ఈ మ్యాచ్లో గెలిచే జట్టే గ్రూప్-ఏ టాపర్గా నిలవనుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మెగా మ్యాచ్కు ముందు అభిమానులను గత రికార్డ్స్ కలవరపెడుతున్నాయి.
మెగా టోర్నీల్లో భారత్పై న్యూజిలాండ్దే పై చేయిగా ఉంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియాను న్యూజిలాండ్ ఓడించగా.. 2023 వన్డే ప్రపంచకప్లో మాత్రం కివీస్కు రోహిత్ సేన షాకిచ్చింది. గత 20 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమిండియాపై న్యూజిలాండ్దే పై చేయిగా నిలుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్తో పాటు 2021 టీ20 ప్రపంచకప్లోనూ భారత్కు న్యూజిలాండ్ షాకిచ్చింది. 2000లో జరిగిన ఐసీసీ నాకౌట్(ఛాంపియన్స్ ట్రోఫీ) ఫైనల్లోనూ న్యూజిలాండ్.. భారత్ను ఓడించింది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అరంగేట్ర ఎడిషన్ ఫైనల్లో భారత్ను న్యూజిలాండ్ మట్టికరిపించింది. ఓవరాల్గా ఇరుజట్ల మధ్య ఐసీసీ టోర్నీల్లో 16 మ్యాచ్లు జరగ్గా.. న్యూజిలాండ్ 10 మ్యాచ్లు గెలిచింది. భారత్ మాత్రం 5 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. వన్డే ప్రపంచకప్ల్లో 11 సార్లు, టీ20 ప్రపంచకప్ల్లో 3, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కసారి భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. 2007 టీ20 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలిచినా.. లీగ్ దశలో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2016 టీ20 ప్రపంచకప్లో సూపర్ 10 మ్యాచ్, 2021 టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్పై న్యూజిలాండ్ విజయం సాధించింది.