డెత్ బౌలింగ్ వైఫల్యంతో పాటు పేలవ బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన ఆరంభ మ్యాచ్లో పాకిస్థాన్ 60 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్.. అనూహ్య ఓటమితో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
ఈ ఘోర పరాజయంతో పాకిస్థాన్ తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ టోర్నీలో చివరి రెండు మ్యాచ్లు గెలిచినా సెమీస్ చేరలేని పరిస్థితిని తెచ్చుకుంది. అంతేకాకుండా న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్కు ఇది వరుసగా మూడో పరాజయం. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మహ్మద్ రిజ్వాన్.. న్యూజిలాండ్ను తక్కువ స్కోర్కు కట్టడి చేసి ఉంటే విజయం దక్కేదని అభిప్రాయపడ్డాడు.

భారీ లక్ష్యాన్ని ఊహించలేదు..
'న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ఈ టార్గెట్ను మేం ఏ మాత్రం ఊహించలేదు. 260 పరుగులు చేస్తుందనుకున్నాం. న్యూజిలాండ్ను కట్టడి చేసేందుకు మేం మా సాయశక్తులా ప్రయత్నించాం. అన్ని వ్యూహాలను ఉపయోగించాం. కానీ వారు అద్భుతంగా ఆడి మంచి లక్ష్యాన్ని మా ముందు ఉంచారు. ఈ పిచ్ ఆరంభంలో బ్యాటింగ్కు కష్టంగా ఉంటుందని భావించాం. కానీ విల్ యంగ్, టామ్ లాథమ్ ఈజీగా బ్యాటింగ్ చేశారు.
రెండు సార్లు మూమెంటమ్..
బౌలింగ్ చివర్లో మేం మళ్లీ అదే తప్పిదం చేశాం. లాహోర్ మ్యాచ్ తరహాలోనే న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసే అవకాశం ఇచ్చాం. బ్యాటింగ్లో మాకు శుభారంభం దక్కలేదు. ఫకార్ జమాన్ గాయంపై స్పష్టత లేదు. అతని రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ప్రస్తుతం అతను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ మ్యాచ్లో మేం రెండు సార్లు మూమెంటమ్ కోల్పోయాం. డెత్ బౌలింగ్లో ఒకసారి.. బ్యాటింగ్ చేసేటప్పుడు పవర్ ప్లేలో రెండో సారి. ఈ ఫలితం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. మేం సాధారణ మ్యాచ్లానే ఆడాం. ఈ మ్యాచ్ అయిపోయింది. మిగతా మ్యాచ్ల్లోనైనా మేం మెరుగైన ప్రదర్శన చేయాలి.'అని మహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.
శతక్కొట్టిన విల్ యంగ్, లాథమ్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 330 పరుగులు చేసింది. విల్ యంగ్(113 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 107), టామ్ లాథమ్(104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 118 నాటౌట్) సెంచరీలతో రాణించారు.
గ్లేన్ ఫిలిఫ్స్((39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(2/63), హ్యారీస్ రౌఫ్(2/80) రెండేసి వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.
బాబర్ జిడ్డు బ్యాటింగ్..
అనంతరం పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. కుష్దిల్ షా(49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 69 ), బాబర్ ఆజామ్(90 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సల్మాన్ అఘా(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ రూర్కీ(3/47), మిచెల్ సాంట్నర్(3/66) మూడేసి వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ(2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. నాథన్ స్మిత్, మైకేల్ బ్రేస్వెల్ తలో వికెట్ తీసారు. బాబర్ జిడ్డు బ్యాటింగ్ పాక్ విజయవకాశాలను దెబ్బతీసింది.