ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందే భారత జట్టును పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ హెచ్చరించాడు. ఈ సారి పాకిస్థాన్ జట్టు చేతిలో భారత్కు ఓటమి తప్పదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో పాకిస్థాన్ మెరుగ్గా రాణిస్తుందని, వరుస విజయాలతో జోరు మీద ఉందని తెలిపాడు.
మరోవైపు భారత్ పేలవ ప్రదర్శనతో చతికిలపడిందని, తీవ్ర ఒత్తిడిలో ఉందన్నాడు. ఈ క్రమంలోనే భారత్పై పాకిస్థాన్ పై చేయి సాధిస్తుందని అంచనా వేసాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మహమ్మద్ అమీర్ సంచలన బౌలింగ్తో భారత్ పతనాన్ని శాసించాడు. అయితే గత రెండేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ దారుణంగా విఫలమైంది.

రిజ్వాన్ రాకతో..
ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023తో పాటు టీ20 ప్రపంచకప్ 2024ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. దాంతో ఆ జట్టులో తీవ్ర మార్పులు జరిగాయి. కెప్టెన్లు, కోచ్లు మారారు. ప్రస్తుతం పరిమిత ఓవర్లలో పాకిస్థాన్ జట్టును వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ నడిపిస్తున్నాడు. అతను సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత పాక్ మళ్లీ విజయాల బాట పట్టింది.
ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన పాక్.. సౌతాఫ్రికా పర్యటనలో మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మరోవైపు గత మూడు నెలల్లో భారత్ ఘోర పరాజయాలను చవిచూసింది. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ కోల్పోవడంతో పాటు.. న్యూజిలాండ్తో సొంతగడ్డపై మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయింది. దాంతో టీమిండియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

బలహీనంగా భారత్..
ఇదే అంశాన్ని ప్రస్తావించిన మహమ్మద్ అమీర్.. ప్రస్తుతం భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, పాకిస్థాన్కు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు. 'ఇటీవల పాకిస్థాన్ అద్భుతంగా ఆడుతోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను వారి సొంతగడ్డపై ఓడించింది. ఇదే పాక్ బలాన్ని తెలియజేస్తోంది.
ముఖ్యంగా ఓవర్సీస్ కండిషన్స్లో పాకిస్థాన్కు తిరుగులేదు. ఇటీవల పాకిస్థాన్ జట్టు ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్పై పై చేయి సాధిస్తోందని అనిపిస్తోంది. అయితే మెగాటోర్నీల్లో టీమిండియానే ఎప్పటికీ నా ఫేవరేట్. కానీ ఈసారి టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది.

బుమ్రా లేకుంటే అంతే..
జస్ప్రీత్ బుమ్రా కూడా అందుబాటులోకి లేకపోతే భారత్ మరిన్ని కష్టాలను ఎదుర్కోనుంది. భారత్ తరఫున అతనే టాప్ బౌలర్. టీమిండియా పేస్ విభాగాన్ని ముందుండి నడిపించేవాడు. అతను లేకపోతే భారత బౌలింగ్ బలం 40-50 శాతం తగ్గనుంది.'అని మహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. 9 ఇన్నింగ్స్ల్లో 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. విదేశాల్లో ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అయితే ఈ సిరీస్ ఆఖరి టెస్ట్లో బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ప్రస్తుతం ఈ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లకు అతను దూరంగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవ్వగా.. భారత్ -పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది.