ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఓవైపు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ సమావేశం జరుగుతున్న వేళ.. భారత విదేశాంగ శాఖ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే పాకిస్థాన్లో పర్యటించలేమని, తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సూచించింది. భద్రతాపరమైన కారణాలతోనే పాక్లో పర్యటించలేమని స్పష్టం చేసింది. దాంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ ప్రయత్నాలు చేస్తుండగా.. అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంగీకరించడం లేదు.

ఈ క్రమంలోనే ఐసీసీ శుక్రవారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. టోర్నీ నిర్వహణపై మరికొద్ది గంటల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. ఇంతలోనే పాక్కు భారత జట్టును పంపించలేమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
'ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్లో పర్యటించే విషయంపై ఇప్పటికే బీసీసీఐ తమ ప్రకటనను విడుదల చేసింది. అక్కడ భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే భారత జట్టును పంపించలేమని పేర్కొంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాం. కాబట్టి, టీమిండియా పాకిస్థాన్కు వెళ్లే అవకాశం లేదు.'అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
మరోవైపు హైబ్రిడ్ మోడల్కు అంగీకరించవద్దని పీసీబీకి ఆ దేశ ప్రభుత్వం సూచించింది. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకోవాలని కూడా సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఐసీసీ హైబ్రిడ్ మోడల్కు పీసీబీ అంగీకరించకపోతే పాకిస్థాన్కు తీవ్ర నష్టం జరగనుంది.