భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్పై ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ను ఉద్దేశించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ ఒక్క విజయం నమోదు చేయకుండా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన తర్వాత పాకిస్థాన్పై గవాస్కర్ విమర్శలు గుప్పించాడు.
పాకిస్థాన్ జట్టును భారత్-బీ, సీ టీమ్స్ కూడా ఓడిస్తాయని అభిప్రాయపడ్డాడు. ప్రతిభావంతమైన ఆటగాళ్లను తయారు చేయడంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెంచ్ బలం లేకపోవడం.. సరైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంతో హోరాహోరీగా సాగాల్సిన భారత్-పాక్ పోరు ఏకపక్షమైందన్నాడు. ఇప్పటికైనా రాజకీయాలను పక్కనపెట్టి ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని పీసీబీకి సూచించాడు.

పనికిరాని మాటలు..
అయితే ఈ వ్యాఖ్యలను తాజాగా పాకిస్థాన్ మాజీ కోచ్ జాసెన్ గిలెస్పీ తప్పుబట్టాడు. 'ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలను నేను చేయదల్చుకోలేదు. ఇండియా బీ టీమ్ లేదా ఇండియా సీ టీమ్ పాకిస్థాన్ జట్టును ఓడిస్తుందని సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను నేను చూశాను. ఇవి అర్థరహితం. ఒక వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సరైన ఆటగాళ్లను ఎంపిక చేసి వారికి సరైన సమయం ఇచ్చి, నైపుణ్యాలను పెంచుకునేలా చేస్తే.. పాకిస్థాన్ జట్టు ఎవరినైనా ఓడించగలదు. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు.
పీసీబీ ప్రక్షాళన చేయాలి..
పాకిస్థాన్ జట్టులో ప్రతిభకు కొదవ లేదు. సరైన ఆటగాళ్లను ఎంపిక చేస్తే సరిపోతుంది. వారికి కాస్త అండగా నిలిచి ఓపికగా ఉంటే పాకిస్థాన్ జట్టుకు పూర్వవైభవం వస్తుంది. కానీ పాకిస్థాన్ క్రికెట్లో చాలా మందికి ఆ ఓపిక లేదు. ఫలితాలు రావాలంటే పీసీబీ పూర్తిగా మారాలి. సరైన వ్యక్తులకు పీసీబీ పగ్గాలు ఇవ్వాలి. సరైన ప్యానెల్ను ఎంచుకోవాలి. ఆటగాళ్లు తమ బాధ్యతలను నిర్వర్తించేలా సమయం ఇవ్వాలి. కొత్త కోచ్ను నియమించుకుంటే.. అతనికి పనిచేసేందుకు కాస్త సమయం ఇవ్వాలి. లేదంటే పాకిస్థాన్ జట్టు రాత మారదు.'అని గిలెస్పీ అభిప్రాయపడ్డాడు.
16 మంది కోచ్లు.. 26 మంది సెలెక్టర్లు..
గతేడాది పాకిస్థాన్ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన జాసెన్ గిలెస్పీ.. మధ్యలో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. పీసీబీతో విభేదాలు తలెత్తడంతో గెలెస్పీపై వేటు వేసినట్లు వార్తలు వచ్చాయి. అకీబ్ జావెద్ను తాత్కలిక కోచ్గా పీసీబీ నియమించింది. కోచ్లను తరుచూగా మార్చడంతోనే పాకిస్థాన్ జట్టు దారుణంగా విఫలమైందని అతను తెలిపాడు. గత రెండున్నరేళ్లలో పీసీబీ 16 మంది కోచ్లతో పాటు 26 మంది సెలెక్టర్లను మార్చిందని చెప్పాడు. ఇలా చేస్తే ఏ జట్టు అయినా దారుణంగానే విఫలమవుతుందని అకీబ్ అభిప్రాయపడ్డాడు.