చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఆసక్తి కనబరుస్తోంది. దాయాదీ దేశాలు ద్వైపాక్షిక సిరీస్లు ఆడకుండా కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతుండుతున్నాయి. దాంతో భారత్-పాక్ మ్యాచ్లకు మరింత డిమాండ్ పేరిగింది. భారత్-పాక్ మ్యాచ్కు ఉండే డిమాండ్ మరోసారి నిరూపితమైంది. అప్కమింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ నెల 23న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లన్నీ గంటల్లోనే అమ్ముడయ్యాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్ గరిష్ట టికెట్ ధర రూ. 1.20 లక్షలు. ఈ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో భారత మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్లో పర్యటించేందుకు బీసీసీఐ ససేమిరా అనడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డు ఓ అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాలు ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ టోర్నీలను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలనే ఒప్పందం చేసుకున్నాయి. భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో పాక్ మ్యాచ్లు తటస్థ వేదికగా జరగనుండగా.. పాక్ వేదికగా జరిగే టోర్నీల్లో భారత్ మ్యాచ్లు కూడా ఆ దేశం బయటే జరగనున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగానే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోని భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. భారత్-పాక్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను సోమవారం సాయంత్ర ఆన్లైన్ వేదికగా అందుబాటులోకి తీసుకురాగా.. నిమిషాల్లోనే సేల్ అయ్యాయి. గరిష్ట టికెట్లు రూ. 47 వేలు, రూ. 1.20 లక్షల టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. భారత్-పాక్ మ్యాచ్కు ఇరు దేశాల సెలెబ్రిటీలు భారీ సంఖ్యలో హాజరవుతారు. ఈ క్రమంలోనే భారీ ధర కలిగిన టికెట్లు కూడా అమ్ముడయ్యాయి.
ఇతర మ్యాచ్ల టికెట్లన్నీ రూ. 2500 నుంచి ప్రారంభమైతే.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్ ధరలు మాత్రం రూ. 10 వేల నుంచి రూ. 1.20 లక్షలుగా ఉండటం గమనార్హం.
ఈ టోర్నీలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్తో భారత్ గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 23న పాకిస్థాన్తో తలపడనుంది. వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత ఈ ఫార్మాట్లో భారత్-పాక్ తలపడటం ఇదే తొలిసారి. మెగా టోర్నీల్లో పాకిస్థాన్పై భారత్కు మెరుగైన రికార్డ్ ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో భారత్ను ఓడించి పాక్ విజేతగా నిలిచింది.