పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) షాకిచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ 2025 టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఐసీసీ సిద్దమవుతున్నట్లు సమాచారం. 8 దేశాలు పాల్గొనే ఈ టోర్నీని ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించాలని పీసీబీ భావించింది. ఈ మేరకు డ్రాఫ్ట్ షెడ్యూల్ను ఐసీసీకి అందజేసింది.
అయితే పాకిస్థాన్తో సత్సంబంధాలు లేకపోవడంతో ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని, దుబాయ్ లేదా శ్రీలంక వేదికగా జరపాలని ఐసీసీని బీసీసీఐ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఆసియా కప్ 2023ను కూడా పీసీబీ.. హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించింది. శ్రీలంక వేదికగా భారత్ మ్యాచ్లను జరిపింది.

అయితే ఈ పద్దతిన టోర్నీ నిర్వహిస్తే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని, భారత్ మ్యాచ్లన్నీ లాహోర్లోనీ గడాఫీ స్టేడియంలో నిర్వహిస్తామని ఐసీసీకి సూచించింది. ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్ చేరినా ఆ స్టేడియంలోనే మ్యాచ్లు ఉంటాయని స్పష్టం చేసింది. ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా పాకిస్థాన్కు రావాలని స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
టీమిండియా.. పాకిస్థాన్ వెళ్లేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసినా.. భారత ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే భారత్.. పాక్ వచ్చే బాధ్యతను పీసీబీ ఐసీసీకి అప్పగించింది. ఇటీవల కొలంబోలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన డ్రాఫ్ట్ బడ్జెట్, షెడ్యూల్ను పీసీబీ.. ఐసీసీకి అందజేసింది.
'ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ గురించి చర్చించడం, ఫైనలైజ్ చేయడం అనేది ఇప్పుడు ఐసీసీ చేతిలో ఉంది. ముసాయిదా షెడ్యూల్లో భారత్ ఆడే అన్ని మ్యాచ్లను లాహోర్లోనే ఆడేలా రూపొందించారు. పన్ను విధి విధానాలు, ఎంపిక చేసిన వేదికలు, భారత్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన వివరాలను పీసీబీ.. ఐసీసీకి సమర్పించింది.'అని ఓ పీసీబీ అధికారి తెలిపాడు.
అయితే ఛాంపియన్స్ టోర్నీని హైబ్రిడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే ఇబ్బంది లేకుండా ఐసీసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. భారత్ మ్యాచ్లు తటస్థ వేదికల్లో నిర్వహించేందుకు కావాల్సిన నిధులను టోర్నీ బడ్జెట్లో కేటాయించింది. టీమిండియా.. పాకిస్థాన్కు వచ్చేలా చివరి వరకు ప్రయత్నిస్తామని, కుదరకపోతే మాత్రం హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాల్సి ఉంటుందని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ను కాదని ఈ టోర్నీ నిర్వహిస్తే అటు పీసీబీ.. ఇటు ఐసీసీ తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.