ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లతో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన విమర్శలను సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం హెర్షల్ గిబ్స్ తప్పుబట్టాడు. ఇదో పనికిమాలిన వాదనని, బయటి విషయాలు పట్టించుకోకుండా ఆటపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్లో పర్యటించేందుకు టీమిండియా నిరాకరించింది. ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపింది. దాంతో ఐసీసీ ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేలా భారత్-పాకిస్థాన్ మధ్య ఒప్పందం కుదిర్చింది.
దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను భారత్ దుబాయ్ వేదికగానే ఆడుతోంది. అయితే ఒకే వేదికలో మ్యాచ్లను నిర్వహించడం ద్వారా భారత్కు అదనపు ప్రయోజనం కలుగుతోందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ అథర్టన్, నాజర్ హుస్సేన్లు ఐసీసీ తీరును తప్పుబట్టారు. ఒకే వేదికపై మ్యాచ్లు ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులు టీమిండియాకు కలిసొస్తాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను హెర్షల్ గిబ్స్ తప్పుబట్టాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ సందర్భంగా మైకేల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్పై స్పందించాడు. బయటి విషయాలను పట్టించుకోకుండా ఆటపై మాత్రమే ఫోకస్ పెట్టాలని ఈ టోర్నీలో పాల్గొనే జట్లకు సూచించాడు.

'దుబాయ్ వేదికగానే అన్ని మ్యాచ్లు జరగడం ద్వారా టీమిండియాకు అదనపు ప్రయోజనం కలుగుతోందనే వ్యాఖ్యలను విన్నాను. అయితే ఈ వాదన సరికాదు. భారత్ దుబాయ్ వేదికగానే ఆడుతోందనే విషయం ప్రతీ జట్టుకు తెలుసు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సరికాదు. వాస్తవాన్ని గ్రహించి అందుకు తగ్గట్లు ఆడటంపై ఫోకస్ పెట్టాలి. ఏదో విషయం మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. నేను అయితే అలా మాట్లాడను. ఒకే వేదికగా మ్యాచ్లు జరిగినంత మాత్రానే విజయాలు దక్కవు. ఏ జట్టు అయినా మెరుగైన ప్రదర్శన చేస్తే గెలుస్తారు. ఇరు జట్లు ఒకే వేదికపై ఆడినప్పుడు.. అదనపు ప్రయోజనం ఎలా లభిస్తోంది. కాబట్టి ప్రత్యర్థి వేదిక ఏంటనేది నేను పట్టించుకోను. ఆటపై మాత్రమే ఫోకస్ పెడ్తాను.'అని హెర్షల్ గిబ్స్ చెప్పుకొచ్చాడు.