ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఒక్క విజయం సాధించకుండానే లీగ్ దశలోనే పాకిస్థాన్ జట్టు ఇంటి ముఖం పట్టడంతో ఈ టోర్నీ నిర్వహణ పీసీబీకి తలకు మించిన భారంగా మారింది.
పాకిస్థాన్ లేని మ్యాచ్లను చూసేందుకు ప్రేక్షకులు మైదానాలకు రావడం లేదు. దాంతో సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్కు ప్రేక్షకులను రాబట్టేందుకు పీసీబీ వింత ఆఫర్ను ప్రకటించింది.
మ్యాచ్కు హాజరయ్యే ప్రేక్షకులకు ఇఫ్తార్ విందు ఇస్తామని పేర్కొంది. ఈ ఇఫ్తార్ బాక్స్లో డేట్స్, జ్యూస్, మినీ పిజ్జాను ఇచ్చింది. ప్రస్తుతం రంజాన్ ఉపవాసం నడుస్తుండటంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో మ్యాచ్కు వచ్చిన ప్రేక్షకులకు ఈ ఇఫ్తార్ బాక్స్లు అందజేశారు. ఈ ప్రకటనతోనైనా ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని పీసీబీ భావించింది. కానీ ఆశించిన స్థాయిలో ఈ మ్యాచ్కు ప్రేక్షకులు రాలేదు.

మరోవైపు భారత్ ఫైనల్ చేరడంతో.. తుది పోరు కూడా దుబాయ్ వేదికగా జరగనుంది. పాక్లో పర్యటించిందేకు టీమిండియా నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని నిర్వహించిన విషయం తెలిసిందే. లీగ్ దశలోనే పాకిస్థాన్ నిష్క్రమించడం.. భారత్ ఫైనల్ చేరడంతో ఆ దేశ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. టీమిండియా కాకుండా ఇతర జట్టు ఫైనల్ చేరి ఉంటే.. లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగేది. కానీ టీమిండియా కారణంగా 29 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఐసీసీ టోర్నీ ఫైనల్ కూడా నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు లీగ్ దశలోనే పాకిస్థాన్ నిష్క్రమించడం.. వర్షంతో పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన మూడు కీలక మ్యాచ్లు రద్దవ్వడంతో బ్రాడ్కాస్టర్స్కు తీవ్ర నష్టాలు వచ్చాయి. నష్టపరిహారం చెల్లించాలిని స్పాన్సర్స్ పీసీబీని డిమాండ్ చేస్తున్నారు.