పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షోయబ్ మాలిక్ టీవీ లైవ్లోనే గొడవపడ్డారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో పాక్ సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం పాకిస్థాన్కు రాగా.. ఆ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టడం.. ఆ టీమ్ ఫ్యాన్స్తో పాటు మాజీ ఆటగాళ్లను తీవ్రంగా నిరాశపర్చింది. దాంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
మహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టుపై ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ జట్టును పూర్తి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్ పరాజయంపై ఓ టీవీ ఛానెల్ లైవ్లో చర్చించిన షోయబ్ అక్తర్, షోయబ్ మాలిక్ గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. ముందుగా అక్తర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్పై ఘాటైన విమర్శలు చేశాడు. రిజ్వాన్ లాంటి పిచ్చోడికి కెప్టెన్సీ ఇస్తే ఫలితాలు ఇలానే ఉంటాయన్నాడు.

పిచ్చోడికి కెప్టెన్సీ ఇస్తే..
'నాకు పాకిస్థాన్ ఆటగాళ్లపై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. నాకు డబ్బులు ఇవ్వకపోతే అసలు నేను ఈ లైవ్లోనే పాల్గొనేవాడిని కాదు. నిజం చెప్పాలంటే పాకిస్థాన్ జట్టు గురించి మాట్లాడాలని కూడా నాకు లేదు. 2011 నుంచి పాకిస్థాన్ జట్టు ఏం చేయాలో చెబుతూనే ఉన్నాను. గత 14 ఏళ్లుగా పాక్ క్రికెట్ టీమ్ తిరోగమనంలో ఉంది. మహ్మద్ రిజ్వాన్ లాంటి పిచ్చోడిని కెప్టెన్గా నియమించి వింతైన ఆటగాళ్లను ఎంపిక చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి.'అని షోయబ్ అక్తర్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
అక్తర్.. నువ్వే చక్కదిద్దు..
ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన షోయబ్ మాలిక్.. అక్తర్ను అడ్డుకున్నాడు. 'నీకు అంత కోపం ఉంటే.. నువ్వే పాకిస్థాన్ క్రికెట్ టీమ్లో చేరి అన్నీ చక్కదిద్దు. ఇలా ఘాటుగా విమర్శించే బదులు జట్టును చక్కదిద్దే బాధ్యత తీసుకో'అని ఆగ్రహాంగా అన్నాడు. వెంటనే షోయబ్ అక్తర్ కూడా ఘాటుగా బదులిచ్చాడు.
నేను రెడీ..
'పాకిస్థాన్ జట్టు కోసం పని చేసేందుకు నేను సిద్దంగా ఉన్నాను. జట్టు కోసం నా వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తాను. పాకిస్థాన్ జట్టు బాధ్యతలను నాకు అప్పజెప్పండి. నేను కుటుంబాన్ని వదిలి పాకిస్థాన్ జట్టు కోసం పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాను. కానీ మూడేళ్ల తర్వాత నా భవితవ్యం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. అయినా నేను రెడీ'అని అక్తర్ ఘాటుగా బదులిచ్చాడు. పరిస్థితి కఠినంగా మారడంతో జోక్యం చేసుకున్న మరో మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్.. 'మిమ్మల్ని మూడేళ్ల పాటు పనిచేయనిస్తారా?'అని ప్రశ్నించాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.