స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగుతుండటం టీమిండియాకు లోటేనని ఇంగ్లండ్ మాజీ కోచ్ డేవిడ్ లాయిడ్ అన్నాడు. వరల్డ్ బెస్ట్ పేసర్ అయిన బుమ్రా జట్టులో ఉంటే టీమిండియా మరింత పటిష్టంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. వెన్నుగాయంతో ఈ టోర్నీకి జస్ప్రీత్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే.
స్కానింగ్ రిపోర్ట్స్ సరిగ్గానే ఉన్నా.. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ లేకపోవడంతో రిస్క్ తీసుకోకుండా బీసీసీఐ అతన్ని జట్టులో నుంచి తొలగించింది. అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం కల్పించింది. టీ20 స్పెషలిస్ట్, యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ను కూడా జట్టులోకి తీసుకున్నారు. మహమ్మద్ షమీ టీమిండియా పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. టీమిండియా బౌలింగ్ విభాగంపై మాట్లాడిన డేవిడ్ లాయిడ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'జస్ప్రీత్ బుమ్రాను దూరమవ్వడం భారత్కు తీవ్ర లోటే. వరల్డ్ బెస్ట్ బౌలర్ అయిన బుమ్రా ఈ సారి ఆడటం లేదు. మహమ్మద్ షమీతో కలిసి యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ పవర్ ప్లేలో కొత్త బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది. అయితే అర్ష్దీప్ సింగ్ టీ20 స్పెషలిస్ట్. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్. 10 ఓవర్లు బౌలింగ్ చేయాలి. అతనికి మరింత మ్యాచ్ ప్రాక్టీస్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే నాలుగు ఓవర్లకు 10 ఓవర్లకు చాలా తేడా ఉంటుంది.'అని లాయిడ్ చెప్పుకొచ్చాడు.
ఫిబ్రవరి 19న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి తెరలేవనుండగా.. ఈ టోర్నీ కోసం టీమిండియా నేడే దుబాయ్ ఫ్లైట్ ఎక్కనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. 23న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మార్చి 2 న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.