ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఇంగ్లండ్తో ముగిసిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మంచి జోష్లో ఉంది. జట్టులో ఆటగాళ్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టచ్లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి తెరలేవనుండగా.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరిగే తొలి మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా లీగ్ దశలో బంగ్లాదేశ్తో పాటు పాకిస్థాన్, న్యూజిలాడ్లతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. లీగ్ దశలో టీమిండియా విజయవకాశాలపై ఓ లుక్కెద్దాం.
బంగ్లాదేశ్పై విజయం సులువే.. కానీ!
తొలి మ్యాచ్లో భారత్.. బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ జట్టుపై భారత్ గెలవడం సులువే. కానీ బంగ్లాకు అండర్ డాగ్గా పేరుంది. ఏ మాత్రం లైట్ తీసుకున్నా బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. ఆ జట్టులో సౌమ్యా సర్కార్, తాన్సిమ్ హసన్ సాకిబ్, మెహ్ది హసన్ మిరాజ్లతో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అయితే షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ వంటి అనుభవం కలిగిన ఆటగాళ్లు లేకపోవడం భారత్కు కలిసొచ్చే అంశం. దుబాయ్లోని నెమ్మదైన పిచ్లపై మెహ్దీ హసన్, రిషద్ హుస్సేన్లు కీలకం కానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో బంగ్లాతో భారత్ ఒకే ఒక్కసారి తలపడి విజయం సాధించింది.

పాకిస్థాన్తో పోరు.. ఒత్తిడి కీలకం!
భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది. భావోద్వేగాలతో కూడిన ఈ మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించే జట్టునే విజయం వరిస్తోంది. మెగా టోర్నీల్లో పాక్పై భారత్దే పైచేయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ముఖాముఖి పోరులో పాక్దే పైచేయిగా ఉంది. మొత్తం ఐదు సార్లు తలపడగా పాక్ మూడు సార్లు విజయం సాధించింది. 2017ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను ఓడించే పాక్ విజేతగా నిలిచింది.
మహమ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్లతో పాక్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. బాబర్ ఆజామ్ ఫామ్లో లేకపోవడం భారత్కు కలిసొచ్చే అంశం. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్లతో పేస్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ.. మేటి స్పిన్నర్లు లేకపోవడం భారత్కు కలిసొచ్చే అంశం. అబ్రార్ అహ్మద్, సల్మాన్ అఘాలను జాగ్రత్తగా ఆడి.. ఒత్తిడిని అధిగమిస్తే టీమిండియా విజయం ఖాయం.
న్యూజిలాండ్తో ప్రమాదం..
బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే.. న్యూజిలాండ్తోనే టీమిండియాకు ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఆ జట్టు సూపర్ ఫామ్లో ఉంది. పాకిస్థాన్ గడ్డపై ముక్కోణపు సిరీస్ గెలిచి జోష్లో ఉంది. డెవాన్ కాన్వే, విలియం యంగ్, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా ఉంది. ముఖ్యంగా మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొవడం టీమిండియా బ్యాటర్లకు సవాలే. సొంతగడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో మిచెల్ సాంట్నర్ టీమిండియా పతనాన్ని శాసించాడు. మెరుగైన క్రికెట్ ఆడితే తప్పా.. న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించలేదు. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ చేరాలంటే మూడింటికి మూడు మ్యాచ్లు గెలవాలి. లేదంటే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇరు జట్లు ఒకే ఒక్కసారి తలపడగా న్యూజిలాండ్ విజయం సాధించింది.