ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరగాల్సిన ఈ గ్రూప్-బీ మ్యాచ్ ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం కారణం ఒక్క బంతి పడకుండానే ముగిసింది. దాంతో ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో గ్రూప్-బీలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మూడేసి పాయింట్స్తో టాప్-2లో కొనసాగుతున్నాయి. తమ తదుపరి మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోనున్నాయి. తమ చివరి లీగ్ మ్యాచ్ల్లో అఫ్గానిస్థాన్తో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్తో సౌతాఫ్రికా తలపడనున్నాయి.
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా తాజా మ్యాచ్ రద్దవ్వడంతో గ్రూప్-బీ సెమీస్ క్వాలిఫికేషన్ రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్కు చేరనున్నాయి. ఓటమితో ఈ టోర్నీని ప్రారంభించిన ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్లు.. మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

సెమీస్ అవకాశాలు ఏంటంటే..?
1. సౌతాఫ్రికా..
గ్రూప్-బీ టాపర్గా ఉన్న సౌతాఫ్రికా.. సెమీఫైనల్ చేరాలంటే.. ఇంగ్లండ్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించాలి. అప్పుడు ఎలాంటి సమీకరణం లేకుండా సెమీఫైనల్కు అర్హత సాధిస్తోంది. ఓడితే మాత్రం.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
2.ఆస్ట్రేలియా
గ్రూప్-బీలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరాలంటే.. అఫ్గానిస్థాన్తో జరిగే మ్యాచ్లో విజయం సాధించాలి. అప్పుడు ఎలాంటి సమీకరణం లేకుండా సెమీఫైనల్కు అర్హత సాధిస్తోంది. ఓడితే మాత్రం.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సౌతాఫ్రికా చేతిలో ఇంగ్లండ్, ఇంగ్లండ్ చేతిలో అఫ్గానిస్థాన్ ఓడిపోవాలి. అప్పుడే మూడు పాయింట్లతో సెమీస్కు అర్హత సాధిస్తోంది.
ఒక్కటి ఓడనా ఇంగ్లండ్, అఫ్గాన్ ఇంటికే..
ఓటమితో ఈ టోర్నీని ప్రారంభించిన ఇంగ్లండ్.. అఫ్గాన్, సౌతాఫ్రికాతో జరిగే తమ చివరి రెండు లీగ్ మ్యాచ్ల్లో విజయం సాధించాలి. ఒక్క మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. అఫ్గానిస్థాన్ది కూడా ఇదే పరిస్థితి. ఆ జట్టు సెమీఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను ఓడించాలి. అప్పుడే 4 పాయింట్లతో సెమీస్ చేరుతోంది.