ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. పసికూన నెదర్లాండ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో అతి కష్టం మీద పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్థాన్ మెరుపు ఫీల్డింగ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది.
పాకిస్థాన్ ఫీల్డింగ్ అనగానే.. ఒకే క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు పరుగెత్తి వదిలేయడం, క్యాచ్ పట్టుకొని ఒకర్ని ఒకరు ఢీకొట్టుకోవడం, బంతిని బౌండరీ లైన్లోకి తన్నడం వంటివి గుర్తొస్తాయి. తరాలు మారినా.. ఆటగాళ్లు మారినా పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ మాత్రం మారలేదనే అప్రతిష్ట ఆ జట్టుకు ఉంది. అలాంటిది నెదర్లాండ్స్తో మ్యాచ్లో పాకిస్థాన్ స్టన్నింగ్ ఫీల్డింగ్తో ఆకట్టుకుంది.
నెదర్లండ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ నవాజ్ వేసిన నాలుగో ఓవర్లో.. డచ్ ఓపెనర్ మైఖేల్ లెవిట్ లాఫ్టెడ్ డ్రైవ్ షాట్ ఆడాడు. అతని షాట్ ధాటికి బంతి లాంగాఫ్ దిశగా దూసుకెళ్లింది. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ ఆజామ్ పరుగెత్తి అద్భుతంగా గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. సమన్వయం కోల్పోయిన అతను వెంటనే బంతిని బౌండరీ లోపలికి విసిరేయగా.. మిడాన్ నుంచి అతన్ని అనుసరిస్తూ వచ్చిన షాహిన్ అఫ్రిది క్యాచ్ అందుకున్నాడు. దాంతో మైఖేల్ లెవిట్ నిరాశగా పెవిలియన్ చేరాడు. చెత్త ఫీల్డింగ్తో సునాయస క్యాచ్లు వదిలేసి నవ్వుల పాలయ్యే పాకిస్థాన్ జట్టుకు ఈ క్యాచ్ వన్నె తెచ్చిపెట్టింది.

అయితే బాబర్ ఆజమ్ పట్టిన ఈ క్యాచ్ రూల్స్ ప్రకారం సరైనదేనా? అనే చర్చ జోరుగా సాగుతోంది.కొన్ని నెలల క్రితం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఫీల్డర్లు నెహాల్ వధేరా, నమన్ ధీర్ ఈ తరహా క్యాచ్తోనే పాకిస్థాన్ షహీన్స్ బ్యాటర్ మాజ్ సదాఖత్ను ఔట్ చేశారు. అయితే థర్డ్ అంపైర్ ఎంసీసీ రూల్ను సాకుగా చూపుతూ నాటౌట్ ఇచ్చాడు. ఈ నిర్ణయం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఆ తర్వాత అది అంపైర్ తప్పిదమని నిపుణులు తేల్చారు. కానీ బాబర్ ఆజామ్ పట్టిన ఈ క్యాచ్పై ఎలాంటి సందేహం అక్కర్లేదని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.
ఆ తర్వాత బాబర్ ఆజామ్ మరో లో-క్యాచ్తో నెదర్లాండ్స్ డేంజరస్ బ్యాటర్ బాస్ డి లీడే (30)ను పెవిలియన్ చేర్చాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 9 క్యాచ్లు పట్టింది. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ క్యాచ్తో పాకిస్థాన్ మెరుపు ఫీల్డింగ్ మొదలైంది. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా బౌండరీ లైన్పై అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 37), బాస్ డీ లీడే(25 బంతుల్లో 4 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మిర్జా(3/24) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్, అబ్రర్ అహ్మద్, సయీమ్ ఆయుబ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షాహీన్ షా అఫ్రిది ఒక వికెట్ తీసాడు.
అనంతరం పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసి గెలుపొందింది. ఓ దశలో 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ఓటమి దిశగా సాగింది. కానీ ఫహీమ్ అష్రఫ్(11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 29 నాటౌట్)అద్భుతమైన బ్యాటింగ్తో పాకిస్థాన్ను గట్టెక్కించాడు.