రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీ కారణంగానే ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT) తెలిపింది. ఐపీఎల్ 2025 విజయానంతరం బెంగళూరు వేదికగా ఆర్సీబీ నిర్వహించిన విజయోత్సవ వేడుకలు విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించగా.. మరో 50 మంది వరకు గాయపడ్డారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన CAT తమ రిపోర్ట్ను తాజాగా బయటపెట్టింది. ఈ రిపోర్ట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. తొక్కిసలాటకు ఆర్సీబీదే ప్రాథమిక బాధ్యత అని క్యాట్ స్పష్టం చేసింది. పోలీసులు, సంబంధిత అధికారుల నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ అనుమతి తీసుకోకుండానే విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పిలుపునిచ్చిందని ట్రిబ్యునల్ పేర్కొంది.

ఆర్సీబీ ముందస్తు అనుమతి లేకుండానే విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో 3 నుంచి 5 లక్షల మంది అభిమానులు వచ్చారని తెలిపింది. 35 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన స్టేడియానికి భారీ సంఖ్యలో హాజరయ్యారని పేర్కొంది. 12 గంటల వ్యవధిలో పోలీసులు ఇంత భారీ జన సమూహాన్ని నియంత్రించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయలేరని అభిప్రాయపడింది. పోలీసులకు అతీత శక్తులు ఉండవని క్యాట్ తమ రిపోర్ట్లో పేర్కొంది.
ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ.. సస్పెండ్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ సస్పెన్షన్ క్యాట్ రద్దు చేసింది. అతని నిర్లక్ష్యం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ట్రిబ్యూనల్ స్పష్టం చేసింది. ఇతర అధికారుల విషయంలోనూ ప్రభుత్వం ఇలానే చేయాలని సూచించింది. తాజా నివేదికతో ఆర్సీబీపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జట్టుపై నిషేధం విధిస్తారా? అనే చర్చ కూడా జరుగుతుంది.
ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్సీబీ తొందరపాటు కారణంగానే ఈ ఘటన జరిగిందని అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా విజయోత్సవ వేడుకల విషయంలో కఠినమైన మార్గదర్శకాలను తీసుకొచ్చింది. విజయోత్సవ వేడుకలకు బీసీసీఐ అనుమతిని తప్పనిసరి చేసింది. టైటిల్ గెలిచిన వెంటనే విజయోత్సవ వేడుకలకు అనుమతి లేదని పేర్కొంది. అన్ని వేడులకు 4-5 అంచెల భద్రత ఉండాలని తెలిపింది.