భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రజత పతక ఆశలు ఆవిరయ్యాయి. పారిస్ ఒలింపిక్స్ 2024లో తన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఆమె వేసిన పిటిషన్ను కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(CAS)బుధవారం కొట్టేసింది. సంయుక్త రజత పతకం ఇవ్వాలని ఆగస్ట్ 7న వినేష్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు అడహక్ డివిజన్ సోల్ ఆర్బిట్రేటర్ అనబెల్ బెనెట్ తీర్పునిచ్చారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్.. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి రజత పతకం ఖాయం చేసుకుంది. కానీ చివరి నిమిషంలో100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యుడబ్ల్యూడబ్ల్యూ) రూల్స్ ప్రకారం.. డిస్క్వాలిఫై అయిన రెజ్లర్కు ఫైనల్ చేరినా చివరి ర్యాంక్ ఇస్తారు. దాంతో ఆమెకు ఏ పతకం రాకుండా పోయింది.

అయితే ఈ డిస్క్వాలిఫికేషన్ను సవాల్ చేస్తూ ఆమె కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(CAS)ను ఆశ్రయించింది. ఫైనల్ చేరిన తనకు కనీసం రజత పతకమైనా ఇవ్వాలని కోరింది. ఇప్పటికే వాదనలు పూర్తి కాగా.. తుది తీర్పును CAS ఇప్పటికి రెండు సార్లు వాయిదా వేసింది. ముందుగా ఆగస్ట్ 13, ఆ తర్వాత ఆగస్ట్ 16లోపు తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది.
దాంతో భారత్ ఒలింపిక్ సంఘం(ఐఓఏ)తో పాటు న్యాయవాదులు, అభిమానులు వినేష్ ఫోగట్కు పతకం వస్తుందేమోనన్న ఆశలను పెంచుకున్నారు. ఈ అంశంపై కాస్ తీవ్రంగా చర్చిస్తున్నందుకే తీర్పు ఆలస్యం అవుతుందనుకున్నారు. కానీ వినేష్ అభ్యర్థనను తిరస్కరించి కాస్ అందరికీ షాక్ ఇచ్చింది.
కాస్ నిర్ణయంపై ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాస్ నిర్ణయం తమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపింది. న్యాయపరంగా ఇంకేమైనా అవకాశాలున్నాయేమో పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చింది.
ఫైనల్కు ముందు బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వినేష్ ఫోగట్.. ఆ బాధలోనే రెజ్లింగ్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆమె ఆగస్ట్ 17న స్వదేశానికి రానుంది.