పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. కెప్టెన్ అంటే టాస్ వేయడం, ఫీల్డ్ సెట్ చేయడం, బౌలర్లను మార్చడం మాత్రమే కాదని చురకలంటించాడు. టాప్-4లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగులు చేయడం కూడా ముఖ్యమని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట సూర్య ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు.
సూర్య గతేడాదిగా దారుణంగా విఫలమవుతున్నాడు. 17 ఇన్నింగ్స్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని సూర్య.. 14 సగటుతో పరుగులే చేశాడు. ఈ 17 ఇన్నింగ్స్ల్లో రెండు సార్లు మాత్రమే 25 ప్లస్ రన్స్ చేశాడు.

సూర్య ప్రదర్శనపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. మెగా టోర్నీకి ముందు ఫామ్ అందుకోవాలని సూచించాడు. ' కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను మార్చడం, ఫీల్డ్ సెట్ చేయడం, వ్యూహాలు రూపొందించడమే కాదు. టాప్-4లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగులు చేయడం కూడా బాధ్యతే. సూర్యకుమార్ యాదవ్ కొన్ని నెలలుగా దారుణంగా విఫలమవుతున్నాడు. 17 ఇన్నింగ్స్ల్లో సగటు 14 మాత్రమే. స్ట్రైక్రేట్ కూడా తక్కువగా ఉంది. ఒక్క హాఫ్ సెంచరీ చేయలేదు. రెండు సార్లు మాత్రమే 25 ప్లస్ రన్స్ చేశాడు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్తో పాటు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ కోల్పోవడం టీమిండియాకు ఇబ్బందికరం. మూడు లేదా లేడా నాలుగో స్థానంలో ఆడుతూ నిలకడగా పరుగులు చేయకపోతే ప్రపంచకప్లో రాణించలేరు. కాబట్టి సూర్య, గిల్ పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టాలి. అది జట్టుకు కూడా చాలా అవసరం.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
శుభ్మన్ గిల్ ఈ ఏడాది 14 టీ20ల్లో 23.90 సగటుతో 263 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20ల్లో సూర్య, శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. ధర్మశాల వేదికగా మూడో ఆదివారం జరగనున్న మూడో టీ20 ఈ ఇద్దరికి అగ్ని పరీక్షగా మారింది.