
ఒకే ఓవర్లో 37 రన్స్..
ఆ రికార్డు మరేదో కాదు.. ఒకే ఓవర్లో 37 పరుగులు. 6 బంతులకు 6 సిక్స్లు కొట్టినా 36 పరుగులే. కానీ ఆ బౌలర్ వేసిన నోబాల్ను కూడా భారీ షాట్ ఆడిన సదరు బ్యాట్స్మన్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అయితే ఈ యూనిక్ రికార్డును నమోదు చేసింది యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ అయితే.. అతని చేతిలో బలైంది మాత్రం కేరళ క్రికెటర్ ప్రశాంత్ పరమేశ్వరణ్. ఈ ఓవర్లో క్రిస్ గేల్ ధాటికి ప్రశాంత్.. పరమేశ్వరా? అని దేవుడిని తలుచుకున్నాడు.

2011 ఐపీఎల్లో..
ఐపీఎల్ 2011 సీజన్లో భాగంగా కొచ్చి టస్కర్స్ కేరళ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ఈ సూపర్ కమ్ వరెస్ట్ రికార్డు నమోదైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ప్రశాంత్ పరమేశ్వరణ్ వేసిన మూడో ఓవర్ను గేల్ చీల్చిచెండాడాడు. 6, 6+నోబాల్, 4, 4, 6, 6, 4తో మొత్తం 37 పరుగులు పిండుకున్నాడు. పరమేశ్వరణ్ వేసిన నోబాల్తో కలిసి మొత్తం 7 బంతులు ఆడిన గేల్.. ఏడింటిని బౌండరీకి తరలించాడు. అప్పట్లో ఈ ఇన్నింగ్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది.

ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి టస్కర్స్ కేరళ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆ జట్టులో రవీంద్ర జడేజా(23), మెకల్లమ్ (22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం చేజింగ్కు దిగిన ఆర్సీబీ గేల్ సునామీ ఇన్నింగ్స్కు తోడు తిలకరత్నే దిల్షాన్(52 నాటౌట్), విరాట్ కోహ్లీ(27 నాటౌట్) రాణించడంతో 13.1 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 128 పరుగులు చేసి 9 వికెట్లతో ఘన విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్తోనే ప్రశాంత్ పరమేశ్వరణ్ కెరీర్ ముగిసినట్లైంది. ఆ తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు.

ఆరు సార్లు 30కి పైగా..
ఇక 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొత్తం ఆరు సందర్భాల్లో బ్యాట్స్మెన్ ఒకే ఓవర్లో 30కిపైగా పరుగులు పిండుకున్నారు. ఇందులో రెండు సార్లు క్రిస్ గేలే కావడం విశేషం. ఒకసారి కొచ్చి టస్కర్స్తో అయితే.. మరో పుణెవారియర్స్ ఇండియా(2012 సీజన్లో) చెలరేగాడు. వీరేంద్ర సెహ్వాగ్(2008), విరాట్ కోహ్లీ(2016), షాన్ మార్ష్(2011), సురేశ్ రైనా(2014)లు కూడా ఒకే ఓవర్లో 30 పరుగులు పిండుకున్నారు.


Click it and Unblock the Notifications












